సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల, తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏ స్థాయిలో కత్తి దూశారో అందరూ చూశారు. ఆమె ఇచ్చాపురం నుంచి అటు తిరుపతి వరకు విస్తృతంగా పర్యటిస్తూ జగనన్న తీరుని, పాలనని ఎండగట్టారు.
ఈసారి కడప లోక్సభ స్థానానికి పోటీ చేసిన వైఎస్ షర్మిల, ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య గురించి అవినాష్ రెడ్డిని ఆయనను వెనకేసుకు వస్తున్న అన్నని గట్టిగా నిలదీశారు. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేక ఇద్దరూ తడబడ్డారు.
పోలింగ్ ముందు రోజు విజయమ్మ అమెరికా నుంచి ఓ వీడియో సందేశంలో వైఎస్ షర్మిలని గెలిపించాలని కడప ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కనుక జిల్లా ప్రజలు కడపలో ఆమెను, పులివెందులలో జగన్ను గెలిపించబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని తేల్చి పడేశాయి. శాసనసభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుస్తారని ఎవరూ ఆశించడం లేదు కానీ కడప నుంచి వైఎస్ షర్మిల తప్పకుండా గెలుస్తారనే అందరూ ఆశిస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ నివేదికలు ఆమె కూడా గెలవలేరని తేల్చేశాయి.
ఒకవేళ ఓడిపోతే ఆమె పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే మరో 5 ఏళ్ళ వరకు ఏపీలో ఎన్నికలు జరుగవు. అంతవరకు కనబడని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కూటమి ప్రభుత్వంతో యుద్ధం చేస్తూ రోజులు దొర్లించడం చాలా చాలా కష్టమే. దాని వలన కంఠశోష తప్ప మరే ప్రయోజనం ఉండదు కూడా.
కనుక ముందస్తు ఒప్పందం ప్రకారం ఆమె రాజ్యసభ సీటు తీసుకొని రాష్ట్రం నుంచి మాయం అయిపోతారేమో? ఆమెను నమ్ముకొని కలుగులలో నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ కలుగుల్లోకి వెళ్ళిపోక తప్పదు.
ఒకవేళ వైఎస్ షర్మిల ఎంపీగా గెలిచినా ఏపీ కాంగ్రెస్కి ఆమె చేయగలిగే ఉపచారం ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ జగన్ ఆహ్వానిస్తే వైసీపిలో చేరిపోవచ్చు లేదా వైసీపినే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసినా ఆశ్చర్యం లేదు. కనుక రాబోయే రోజుల్లో అన్నా చెల్లి ఏవిదంగా రాజకీయాలు చేస్తారో చూడాల్సిందే.




