విద్యాశాఖకు విద్యావంతుడు మంత్రిగా ఉండాలనుకోవడం అత్యాశ కాబోదు. కానీ జగన్ ఆ శాఖకు బొత్స సత్యనారాయణని మంత్రిగా నియమించి, సంస్కరణలు, ప్రక్షాళన పేరుతో 5 ఏళ్ళు ఏవిదంగా భ్రష్టు పట్టించేశారో అందరూ చూశారు. పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య నేర్పిస్తామని చెప్పి ‘జగన్ మావయ్యా’ అంటూ చిన్నప్పటి నుంచే రాజకీయాలు నేర్పించడం మొదలుపెట్టారు.
జగన్ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ నిబద్దత ఉండేది కాదు. అందుకే మూడేళ్ళుగా టెట్ పరీక్షలు నిర్వహించనే లేదు. టెట్ పరీక్షలు నిర్వహించకపోవడం, 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసి సరిగ్గా ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడమే ఇందుకు నిదర్శనం.
జగన్ ప్రభుత్వం డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేయాలనుకోలేదు. ఆ పేరుతో ఎన్నికలలో వైసీపికి ఓట్లు రాల్చుకోవాలని దురాలోచన చేసిందని చెప్పవచ్చు. అందుకే ఉపాధ్యాయులు, నిరుద్యోగులే వైసీపిని ఓడించి జగన్ని మూల కూర్చోపెట్టారని చెప్పవచ్చు.
ఎన్నికలలో హామీ ఇచ్చిన్నట్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మొట్ట మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు. దానిద్వారా రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ భర్తీ ప్రక్రియ ఏళ్ళ తరబడి సాగితే అది నిరుద్యోగులను మబ్యపెడుతున్నట్లే అని భావించిన సిఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 10వ తేదీలోగా నియామక పత్రాలు అందజేయాలని ముందే డెడ్లైన్ విధించారు.
సంస్కరణల పేరుతో జగన్ ప్రభుత్వం విద్యాశాఖని భ్రష్టు పట్టించేయడంతో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ముందుగా వాటన్నిటినీ సరిదిద్దుతున్నారు. దానిలో భాగంగానే డీఎస్సీ పరీక్షలతో పాటు టెట్ పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 30వ తేదీన టెట్, డీఎస్సీ రెండు పరీక్షలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడబోతోంది. కనుక ఇంతవరకు టెట్ పరీక్షలు వ్రాయనివారు టెట్ వ్రాసి అర్హత సాధిస్తే, వెంటనే డీఎస్సీ పరీక్షలు వ్రాసి వాటిలో కూడా అర్హత సాధిస్తే ఈ ఏడాది ముగిసేలోగా ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలుగుతారు. డీఎస్సీ విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది?




