రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల అభివృద్ధి గురించి, ప్రజాసమస్యల పరిష్కారం గురించి తమ అధినేతతో ఎప్పుడైనా మాట్లాడుతారో లేదో తెలీదు కానీ తమ పదవులు, వారసులకు టికెట్ల గురించి ఏదో ఓ సందర్భంలో అధినేతను కలిసినప్పుడు తప్పక మాట్లాడుతారు.
తిరుమల దేవస్థానం పాలకమండలి పదవీకాలం మరో వారం రోజులలో ముగియబోతుండటంతో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఛైర్మన్ పదవి తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రయత్నం ఫలించింది. భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన పదవీకాలం రెండేళ్ళు. మళ్ళీ ఎన్నికలలో గెలిచి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగవచ్చు. కానీ ప్రభుత్వం మారితే ఏడాదిలోగానే తప్పుకోక తప్పదు. భూమన 2006-2008 వరకు రెండేళ్ళపాటు టీటీడీ ఛైర్మన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా తమని నియమించాలని కోరుతూ వారి అధినేత చుట్టూ తిరుగుతున్నారు. దానిలో 35 మంది సభ్యులకు అవకాశం ఉంది. కనుక త్వరలో వారితో టీటీడీ పాలకమండలిని నింపేయడం ఖాయమే.
ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఇక నుంచి పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టవచ్చు.



