ప్రభుత్వోద్యోగులతోనే ప్రభుత్వ వ్యవస్థలన్నీ నడుస్తుంటాయి. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నడిపేది ఉపాధ్యాయులే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి సుమారు 13.2 లక్షల మంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వారితో చలగాటం ఆడుతోంది.
“నేను అధికారంలోకి రాగానే సీపీఎస్ పింఛను విధానాన్ని రద్దు చేస్తానని” జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ మూడున్నరేళ్ళవుతున్నా రద్దు చేయకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అమరావతిలో సచివాలయ ఉద్యోగులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. వారితో చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా పోలీసులతో వారిని భయపెట్టాలని ప్రయత్నిస్తుండటం చాలా చాలా బాధాకరం.
ఇక ఉపాధ్యాయులు మొబైల్ యాప్ ద్వారా హాజరుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిని బలవంతంగా ఒప్పించి నేటి నుంచి అమలుచేస్తుండటంతో వారు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పాఠశాలలలో బయోమెట్రిక్ పరికరాలు ఉన్నప్పటికీ మొబైల్ యాప్ ద్వారా హాజరు వేసుకోవాలని బలవంతం చేయడం ప్రభుత్వానికి తమపై నమ్మకం లేకపోవడమే, ఇది తమపై కక్ష సాధించడమే అని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం తమతో వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు 13.2 లక్షలమంది కాగా, వారి బంధుమిత్రులు, సమాజంలో తమ చుట్టూ ఉండేవారిలో కనీసం ఒక కోటి మందిని వారు ప్రభావితం చేయగలరు. అంటే వారితో వైసీపీ ప్రభుత్వం ఇదేవిదంగా చలగాటం అడితే వచ్చే ఎన్నికలలో ఇందుకు భారీ మూల్యం చెల్లించకతప్పదని గ్రహిస్తే మంచిది.



