సినిమాలు చూసే అమ్మాయిలు లేచిపోతున్నారట!

Vasireddy Padmaఎవరైనా మహిళల గురించి చులకనగా మాట్లాడితే మహిళా కమీషన్‌ వారిని సరిదిద్దాలి. కానీ మహిళల గురించి మహిళా కమీషనే చులకనగా మాట్లాడితే?

ఏపీ మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ హోదాలో ఇంకా ఉన్నారో లేదో తెలీని వాసిరెడ్డి పద్మ ఈరోజు రాష్ట్రంలో మహిళల అదృశ్యం అవుతుండటం గురించి పవన్‌ కళ్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు జవాబు చెపుతూ మాట్లాడిన మాటలు వింటే విస్మయం కలుగుతుంది.

ADVERTISEMENT

మహిళల అదృశ్యమవుతున్న రాష్ట్రాలలో ఏపీ 11వ స్థానంలో ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొని పవన్‌ కళ్యాణ్‌ కువిమర్శలు చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇంకా ఎక్కువమందే మహిళలు అదృశ్యమవుతున్నారు. ఆ రాష్ట్రాలను నిలదీయకుండా 11వ స్థానంలో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆమె అడిగారు. పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడు మాత్రమే కాదు విషపుత్రుడు కూడా,” అని వాసిరెడ్డి పద్మ అన్నారు.

రాష్ట్రంలో అదృశ్యం అయిన మహిళలలో ఎక్కువ మంది ప్రేమ వ్యవహారాల కారణంగానే అదృశ్యమవుతున్నారని అన్నారు. అంటే వాడుక భాషలో ‘లేచిపోతున్నారని’ ఆమె చెపుతున్నారన్న మాట! “అలా లేచిపోయినవారిలో మళ్ళీ 70 శాతం మంది అమ్మాయిలు ఇళ్ళకు తిరిగివచ్చేస్తున్నారు. వారు మీ సినిమాలు చూసే చెడిపోతున్నారనే విషయం తెలియదా?”అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

అదృశ్యమైన మహిళల రికవరీలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌కు మహిళలన్నా, మహిళా కమీషన్‌ అన్నా, వాలంటీర్లన్నా గౌరవం లేదని అన్నారు. భరణం ఇచ్చి భార్యలను వదిలించుకోవచ్చని చెపుతున్న పవన్‌ కళ్యాణ్‌ ఎదుటపడితే లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాలని ఉందన్నారు.

రాష్ట్రంలో మహిళలు ఇంట్లో కూర్చోనే ఆన్‌లైన్‌ సంక్షేమ పధకాలు పొందుతున్నారని, మహిళలను ఎంతగానో గౌరవిస్తున్న జగన్‌ను తాను పొగిడితే తప్పేమిటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

గత మూడేళ్ళలో ఏపీలో 30,196 మహిళలు కనబడకుండా పోయారని, వారిలో 18 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న మైనర్ బాలికలు 7,918 మంది ఉన్నారని కేంద్ర సహాయమంత్రి చెప్పిన విషయాన్నే పవన్‌ కళ్యాణ్‌ గుర్తుచేసి ప్రశ్నించినప్పుడు అందుకు సూటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మహిళా కమీషన్‌, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది.

‘ఇంతమంది ఎందుకు అదృశ్యం అవుతున్నారు? వారి పరిస్థితి ఏమిటి?’ అని పవన్‌ కళ్యాణ్‌ అడిగితే, “మిగిలిన రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ మంది అదృశ్యమవుతున్నారు కదా?వాటితో పోలిస్తే ఏపీలో తక్కువమందే (30,196 మహిళలు) అదృశ్యమయ్యారని” పోల్చి సమర్ధించుకోవడం విస్మయం కలిగిస్తుంది.

మహిళలను గౌరవించడం పవన్‌ కళ్యాణ్‌ నేర్చుకోవాలని చెపుతూనే అమ్మాయిలు సినిమాలు చూసి అబ్బాయిలతో లేచిపోతున్నారంటూ వాసిరెడ్డి పద్మ చులకనగా మాట్లాడటం ఇంకా దిగ్బ్రంతి కలిగిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories