ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచూ హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటారు. కొందరు అక్కడే ఉంటున్నారు. కనుక వారి రాకపోకలను మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు.
కానీ తెలంగాణ నేతలు చాలా అరుదుగా ఏపీకి వస్తుంటారు. ఒకవేళ వచ్చినా తిరుమల స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. కనుక తెలంగాణ నేతలలో ఎవరు ఎప్పుడు ఏపీకి వచ్చినా మీడియా ఫోకస్ వారిపైనే ఉంటుంది. వారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
పొన్నూరు టీడీపి ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర చిన్న కుమార్తె నాగసాయి వైదీప్తి కేవీఎన్ రామ్ల వివాహం నేడు గుంటూరులో జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా వచ్చారు. సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పలకరించి అనంతరం వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు. ఏపీ తెలంగాణ సిఎంలు ఇలా ఒకే చోట గుంటూరులో కలవడం చాలా అరుదైన దృశ్యమే అని చెప్పొచ్చు.
రెండు రాష్ట్రాల నాయకుల మద్య ఇంత సఖ్యత, సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య, ప్రభుత్వాల మద్య అనేక వివాదాలు నడుస్తున్నాయి. వాటి కారణంగా రెండు ప్రభుత్వాలు పరస్పరం విమర్శించుకుంటాయి కూడా.
వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా సత్సంబంధాలు ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సామరశ్యంగా పరిష్కరించుకోవచ్చు కదా? అని సామాన్య ప్రజలు అనుకోకుండా ఉంటారా? కానీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అంటే ఇక్కడ వైసీపీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అడ్డుగోడల్లా నిలబడి ఉన్నందునే అనుకోవాలేమో?






