ఏపీ, తెలంగాణ రెండుగా విడిపోయి అప్పుడే ఓ పుష్కరం. ఈ 12 ఏళ్ళలో రెండు రాష్ట్రాలలో మారిన రాజకీయ పరిస్థితి, భవిష్యత్ రాజకీయ పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
పట్టుబట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మలిచారు. తమ ప్రత్యర్ధులను దాదాపు నిర్వీర్యం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ ఓడిపోకూడదు. ఒకవేళ ఓడితే గీడితే కేంద్రం అండదండలున్న బిజేపి చేతిలో ఓడిపోయుండాలి. కానీ కేసీఆర్ కంటికి ఆనని కాంగ్రెస్ పార్టీ.. దాని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
నిజానికి కేసీఆర్ తన ప్రత్యర్ధులను నిర్వీర్యం చేసే బదులు ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగించి ఉంటే ప్రజలే మరోసారి ఆయనకు పట్టం కట్టి ఉండేవారు. కానీ అధికార మదంతో సామాన్య ప్రజల మొదలు ఢిల్లీ పెద్దల వరకు ప్రతీ ఒక్కరి అహాన్ని దెబ్బ తీశారు. ఫలితం అనుభవించారు.
నాటి కేసీఆర్ నిరంకుశ పాలన పర్యవసానాలు అయన పాలనతో అంతం కాలేదు. నేటికీ తెలంగాణలో పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయన సొంత కూతురు కల్వకుంట్ల కవిత తనకు జరిగిన రాజకీయ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు సొంత కుంపటి పెట్టుకున్నారు. తాజాగా జనసేన కూడా తెలంగాణ అధ్యాయం ప్రారంభిస్తోంది.
తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళలో ఇన్ని పార్టీలు ఎందుకు ఏర్పడ్డాయి? తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని ఎందుకు భావిస్తున్నాయి? అంటే కేసీఆర్ అనుసరించిన రాజకీయ విధానాలే కారణమని చెప్పక తప్పదు.
కానీ 12 ఏళ్ళ తర్వాత ఏపీలో ఎన్ని పార్టీలున్నాయి? అని చూస్తే కూటమిలో ఒక్కటిగా ఉన్న మూడు పార్టీలు, మరోవైపు వైసీపీ మాత్రమే కనిపిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం చేతిలో అంత దారుణంగా వేధింపులకు గురైన టీడీపి, జనసేనలు అధికారంలోకి రాగానే పగ, ప్రతీకారాలు తీర్చుకుంటాయని వైసీపీ నేతలే అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అటువంటి ఆలోచన కూడా చేయలేదు.
విభజన తర్వాత, మళ్ళీ ఇప్పుడూ కూడా సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగిస్తోంది. ఈ కారణంగానే నేడు వైసీపీ బలమైన ప్రతిపక్షంగా నిలబడగలుగుతోంది. కనుకనే ఏపీలో రాజకీయ శూన్యత ఉందని ఎవరూ భావించడం లేదు.
ఒకవేళ వైసీపీ మరో 5 ఏళ్ళు అధికారంలో కొనసాగి టీడీపి, జనసేనలను నిర్వీర్యం చేయగలిగి ఉంటే, అప్పుడు ఏపీలో కూడా తెలంగాణలో మాదిరిగానే రాజకీయ అనిశ్చిత, రాజకీయ శూన్యత కనిపిస్తూ అందరినీ ఊరిస్తూ ఉండేది.
అప్పుడు ఏపీలో కూడా ఇప్పుడు తెలంగాణలో మాదిరిగానే పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు తప్పక పుట్టుకొచ్చేవి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల అదృష్టం కొద్దీ అటువంటి దుస్థితి కలుగనందుకు సంతోషించాల్సిందే.




