అదేంటో ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అతివృష్టి అనావృష్టి లాగా ఉంటే వరసగా సినిమాలు వస్తాయి. లేదా మరీ డ్రైగా ఎలాంటి సందడి లేకుండా శుక్రవారాలు గడిచిపోతాయి. మార్చి నెల బలగంతో బోణీ చేసి దసరాతో గ్రాండ్ గా ముగిసింది. ఇప్పుడందరి చూపు ఏప్రిల్ మీదుంది. ప్రతి వారం చెప్పుకోగ్గ రిలీజులు బలంగా ఉన్నాయి. కానీ విచిత్రంగా సందడి మాత్రం పెద్దగా కనిపించడం లేదు. రవితేజ రావణాసుర అంచనాలు పెంచడంలో తడబడుతోంది. బుకింగ్స్ నెమ్మదిగానే ఉన్నాయి.
క్రైమ్ థ్రిల్లర్ కావడం సెన్సార్ చెప్పిన కట్లకు మ్యూట్లకు ఒప్పుకోకపోవడం వల్ల ఏ సర్టిఫికెట్ రావడం లాంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. టాక్ వస్తే ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి కానీ అదెలా ఉంటుందన్నది కీలకం. కిరణ్ అబ్బవరం సుడిగాలిలా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నా మీటర్ సైతం ఇదే సమస్యతో బాధ పడుతోంది. ట్రైలర్లో రొటీన్ పోలీస్ కథలా అనిపించడంతో పాటు తక్కువ గ్యాప్ తో కుర్రాడు థియేటర్ల మీద దాడి చేస్తుండటంతో రివ్యూలు చూశాక వెళదాంలే అనే ధోరణి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
సమంతా శాకుంతలం అన్ని కోట్ల బడ్జెట్ తో రూపొందినా రుద్రమదేవి టైంలో వచ్చిన హైప్ లో సగం కూడా తెచ్చుకోలేకపోయింది. దర్శకుడు గుణశేఖర్ తో ఇతర టీమ్ సభ్యులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ ఇదీ పబ్లిక్ రెస్పాన్స్ మీద ఆధారపడ్డదే. లారెన్స్ చాలా గ్యాప్ తర్వాత చేసిన రుద్రుడుకి అసలు పబ్లిసిటీ చేయడమే మర్చిపోయారు. వస్తుందో ఆఖరి నిమిషంలో వాయిదా పడుతుందో నిర్మాతకే తెలియాలి. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సెటప్ ఆసక్తికరంగానే ఉంది. ప్రచారాలు గట్రా వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ వెంకటేష్ పూజా హెగ్డేల క్రేజీ కాంబో కిసీకా భాయ్ కిసీకా జాన్ కోసం ఫ్యాన్సే ఎగబడి ఎదురు చూడటం లేదు. తెలంగాణ టచ్ ఇచ్చిన ఈ ఫ్యామిలీ మూవీతో ఏ మాత్రం మెప్పిస్తారో చూడాలి. ఇక చివరి వారంలో విడుదలవుతున్న ఏజెంట్ కి ఇప్పటికీ ప్రాపర్ ప్రమోషన్ మొదలుపెట్టలేదని అక్కినేని ఫ్యాన్స్ వాపోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2 మీద తమిళంలో తప్ప ఇతర భాషల్లో అంతగా ఆసక్తి కనబరచని సంగతి తెలిసిందే. ఒకపక్క మాడుపగిలే ఎండలు, ఇంకో వైపు ఫ్రీగా వస్తున్న ఐపీఎల్ మ్యాచులు, పదో తరగతి పిల్లల పరీక్షలు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇలా సందడి తక్కువగా ఉంటే కష్టం.



