ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన “అరవింద సమేత” ఆడియో రేపు నేరుగా యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కానుంది. అలాగే మార్కెట్ లో సిడిలు కూడా రేపటి నుండి అందుబాటులో ఉండనున్నాయి. కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్న ఈ ఆల్బమ్ లో ట్రాక్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో ఉన్న గాయనీగాయకుల పేర్లు, పాటల రచయితల పేర్లు చూస్తుంటే, ఖచ్చితంగా ‘అరవింద సమేత’ ఒక సెన్సేషన్ అయ్యేలా కనపడుతోంది.
[m9ad]
కైలాష్ ఖేర్ స్వరంతో తెలుగు నాట వచ్చిన పాటలు ఎంతటి సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ కైలాష్ ఖేర్ స్వరంతో ‘ఏడపోయినాడో’ అన్న పాటతో ఈ ఆల్బమ్ ప్రారంభం కానుంది. సిరివెన్నెల సాహిత్యం ఈ పాటకున్న మరో ప్రధాన బలం. ఇక రెండవ పాట ‘అనగనగనగా’ ఇప్పటికే విడుదల కావడం, సంగీత, సాహిత్య ప్రియుల మెప్పు పొందడం జరిగిపోయింది. ఈ పాటకు కూడా సిరివెన్నెలే సాహిత్యం సమకూర్చారు.
ఇక మిగిలిన రెండు పాటలకు రామ్ జో లిరిక్స్ ఇవ్వగా, ‘పెనివిటి’ అన్న పాట ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. కాలభైరవ ఆలపించిన ఈ పాట, ఒక సెన్సేషన్ సృష్టిస్తుందన్న టాక్ ఇప్పటికే బలంగా వినపడుతున్న నేపధ్యంలో… అందరి కళ్ళు, చెవులు ప్రస్తుతం ఈ పాట మీద పడ్డాయి. ఆల్బమ్ లో చివరి పాట ‘రెడ్డి ఇక్కడ సూడు’ను దలేర్ మేహేంది పాడడంతో ఇది మస్త్ మాస్ సాంగ్ గా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కోసం పెట్టినట్లుగా కనపడుతోంది.
ఉన్న నాలుగు పాటలు నాలుగు కాలాల పాటు నిలిచిపోతాయో లేదో తెలియాలంటే, మరొక రోజు ఆగాలి. కానీ సంగీత ప్రియులకు ప్రామిసింగ్ ఆల్బమ్ గా “అరవింద సమేత”ను ఎస్.ఎస్.థమన్ ఇవ్వబోతున్నాడన్న నమ్మకం అయితే ఇప్పటికే కలిగింది. ఇటీవల కాలంలో అగ్ర సినిమాల ఆడియోలు అంతగా ప్రజాధరణకు నోచుకోలేకపోతున్న తరుణంలో…. ‘అరవింద సమేత’ పట్ల పాజిటివ్ వైబ్ ఉండడం శుభపరిణామం.



