అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడు యావత్ ప్రపంచదేశాలు సంతోషించాయి. ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించిన పాక్ చాలా సంతోషించింది. కానీ ఇరుదేశాలు ఆ ఒప్పందాన్ని పక్కన పడేసి మళ్ళీ పరస్పరం దాడులు చేసుకోవడం మొదలుపెట్టాయి.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు, అందుకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు మొదలయ్యాయి. కనుక వాటికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావారాలున్న గల్ఫ్ దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులు మొదలుపెట్టింది. ఈ పరస్పర దాడులతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.
అమెరికా-ఇరాన్ మద్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తే అవి వ్యూహాత్మకంగానే శాంతి చర్చల పేరుతో యుద్ధ విరమణ పాటిస్తుంటాయి తప్ప ఇరు దేశాలకు యుద్ధవిరమణపై ఆసక్తి, నిబద్దత లేదని మరోమారు స్పష్టం చేస్తున్నాయి. .
కనుక ఎవరి కారణాలతో వారు యుద్ధం కొనసాగించాలని పట్టుదలగా ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం ఫలించదు. అనే సంగతి భారత్ ముందే గ్రహించింది. ఈ యుద్ధం విషయంలో భారత్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రాకులాడకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచీ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది.
అటు అమెరికాతో, ఇటు ఇరాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ చమురు సంక్షోభంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగింది. కాల్పుల విరమణ ఉల్లంఘించి ఇరు దేశాలు మళ్ళీ యుద్ధం ప్రారంభించినా భారత్పై ఎలాంటి దౌత్య వైఫల్య ముద్ర పడలేదు.
భారత్ విదేశాంగ విధానంలో ఇది కొత్త పాఠం కాదు. ప్రపంచంలోని ప్రతి సంక్షోభంలో మధ్యవర్తిగా మారాలనే ఆత్రం కంటే, దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికే న్యూఢిల్లీ ప్రాధాన్యం ఇస్తోంది.
అయితే ఈ యుద్ధంలో దిగి చిక్కుపడినందుకు అమెరికా, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ ఏదో ఓ రోజు ఈ యుద్ధం ముగించక తప్పదు. కానీ జరిగిన నష్టానికి రెండు దేశాలు చింతించక తప్పదు.
ఈ యుద్ధం వలన భారత్ కూడా తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ నష్ట తీవ్రతని తగ్గించుకోగలిగింది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసిన దేశం మన భారత్.




