బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బెట్టింగ్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సందర్భంగా జరిగిన బెట్టింగ్ కేసులపై థానే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో అర్బాజ్ పేరు బయటకు రావడంతో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు. శనివారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
మూడు రోజుల క్రితం సోనూ యజేంద్ర అనే బుకీని థానే క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు అర్బాజ్ పేరును బయటపెట్టాడు. దీంతో ఈ దందాలో అతడి పాత్రను నిర్ధారించుకునేందుకు సమన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ… అర్బాజ్ బెట్టింగ్లకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని, అతడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. తాజాగా అర్బాజ్కు చెందిన మరో విషయం బయటపడి సంచలనమైంది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బుకీ సోను జలాన్ వద్ద బెట్టింగ్ కాసిన అర్బాజ్ ఏకంగా 2.80 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో జలాన్ బెదిరించినట్టు సమాచారం. మే 16న థానెలోని డోమ్బీవ్లీలోని ప్రధాన బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో జలాన్ వారి కోసం ఎదురుచూస్తూ పోలీసులకు చిక్కాడు. ‘జూనియర్ కోల్కతా’ అని బెట్టింగ్ రాయుళ్లు జలాన్ ను దేశవ్యాప్తంగా ముద్దుగా పిలుచుకుంటారు. అతడి బెట్టింగ్ వ్యాపారాల వార్షిక టర్నోవర్ 100 కోట్లని పోలీసులు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.



