ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ల మొహాలు చూసే ప్రజలు ఆయా పార్టీలను గెలిపిస్తుంటారని చెప్పక తప్పదు.
వారి కృషి, వ్యూహాలు, నిర్ణయాలు, వారి ఇమేజ్, ప్రజాధరణ వల్లనే ప్రజలు ఆయా పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపిస్తుంటారు.
మూడు పార్టీలలో కొంతమంది సీనియర్ నాయకుల పరపతి, అంగబలం , అర్ధబలం ఆధారంగా గెలుస్తుంటారు. కానీ మిగిలినవారు పార్టీ అధినేతల పేరు, ఫోటో పెట్టుకునే గెలుస్తుంటారు. పార్టీ అధినేతలే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని వారిని గెలిపించుకుంటుంటారు.
పార్టీ టికెట్ లభిస్తే అదే పదివేలనుకునే నేతలు అధినేతల కృషి, కష్టం, ఇమేజ్ వలన గెలిచి ఎమ్మెల్యేలయిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా, కృతజ్ఞతగా ఉండాలి కదా?
కానీ ఎమ్మెల్యే కాగానే ఈ ప్రపంచాన్ని జయించేశామన్నట్లు విర్రవీగుతూ లేదా మళ్ళీ 5 ఏళ్ళ వరకు ప్రజలకు మొహం చూపించాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తుంటారని నాడు వైసీపీలో నేడు టీడీపిలో నిరూపిస్తున్నారు.
పార్టీ అధినేతలే వారిని ఎన్నికలలో గెలిపించాలి. తర్వాత మంత్రి పదవులు ఇవ్వాలి. ప్రభుత్వం నడిపించాలి. పార్టీని చూసుకోవాలి. రాజకీయ ప్రత్యర్ధుల కుట్రలు, కుతంత్రాలను నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉండాలి.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. సంక్షేమ పధకాలకు సొమ్ము సమకూర్చుకొని అమలు చేసి ప్రజలను మెప్పించాలి. కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. దేశవిదేశాలకు వెళ్ళి పెట్టుబడిదారులను ఒప్పించి రప్పించాలి.
ఇలా అన్ని పనులు పార్టీ అధినేతలు మాత్రమే చేయాలా?మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత ఉండదా?అలాంటివారికి టికెట్లు ఇచ్చి పార్టీ, వారిని ఎన్నుకొని ప్రజలు మోసపోయినట్లే కదా?







