ఆడపిల్లలు అందంగా ఉండాలనుకుంటారు. అందరూ తమ అందాన్ని మెచ్చుకోవాలనుకుంటారు. ఇది ప్రకృతి సహజం. కానీ వైసీపీలో అందంగా ఉండటమే ప్రమాదం అంటున్నారు ఆ పార్టీ అధినేత జగన్.
నేడు విజయవాడ సబ్-జైలులో వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “వంశీ చాలా అందంగా ఉంటాడు. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన రాజకీయాలలో రాణిస్తుంటే చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక తప్పుడు కేసుతో అరెస్ట్ చేయించారు. అవినాష్ కూడా నారా లోకేష్ కంటే చాలా అందంగా ఉంటాడు. కనుక రేపు ఇతనిని ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపించినా ఆశ్చర్యం లేదు,” అని అన్నారు.
జగన్ తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానని, తనకు చక్కటి హ్యూమర్ ఉందనుకుంటారు. కానీ మీడియాతో మాట్లాడిన ప్రతీసారి ఇలా దొరికిపోతుంటారు.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి కనీసం ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయిన వల్లభనేని వంశీని చూసి ఈర్ష్య పడుతున్నారని, అందుకే అరెస్ట్ చేయించారని జగన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?తన కోసం నేరాలు చేసి వంశీ అరెస్ట్ అయితే అందగాడు కనుకనే అరెస్ట్ చేశారని ఓ పార్టీని నడిపిస్తున్న జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి?
ఒకవేళ అరెస్ట్ చేయడానికి నేతల అందచందాలే పరిగణనలోకి తీసుకుంటే వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలలో అందగాడు జగన్మోహన్ రెడ్డే కనుక ముందుగా ఆయననే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.
జగన్ మెప్పు కోసమే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంపై అనుచరులతో దాడి చేయించారు. ఆ కేసు నుంచి బయటపడటానికే పోలీస్ స్టేషన్లో తమపై పిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి, బెదిరించారు.
అంటే వంశీ రెండు తీవ్రమైన నేరాలకు పాల్పడారన్న మాట. పోలీసులు ఈ రెండు నేరాలు నిరూపించగలిగితే వంశీకి జైలు జీవితం తప్పదు.
అయినా జగన్తో సహవాసం చేసినవారు ఎవరైనా తప్పనిసరిగా జైలుకి వెళ్ళిరాక తప్పదని వంశీ అరెస్టుతో మరోసారి నిరూపితమైంది. రేపు కోడాలి నాని, పేర్ని నాని, అవినాష్ అందరూ జైలుకి వెళతారని జగనే చెపుతున్నారు కదా?




