తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉంటారు. అయితే నిన్న హైదరాబాద్లో స్టీల్ ప్లాంట్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సభలో సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఓవైసీ ఓ మాట చెప్పారు.
“ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని లేకుంటే మీరు ఫామ్హౌసుకి వెళ్ళాల్సివస్తుందని చెప్పాను. కానీ కేసీఆర్ నా మాట పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు. నేను చెప్పినట్లుగానే ఫామ్హౌసు చేరుకున్నారు.
ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డికి కూడా నేను ఓ సలహా ఇవ్వదలచుకున్నాను. మీరు సిఎం అయిన తర్వాత మీలో ఆ దూకుడు తగ్గింది. కనుక నేను మళ్ళీ మునుపటి రేవంత్ రెడ్డిని చూడాలనుకుంటున్నాను. మీరు ప్రజలలోకి వెళ్ళండి… వారికి దగ్గరయ్యి ఆదరణ పొందండి,” అని ఓవైసీ హితవు పలికారు.
ఇదే వేదికపై ఇంత కంటే ముఖ్యమైన విషయం మరొకటి చెప్పారు. “గతంలో మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి కాదు.. సిఎం రేవంత్ రెడ్డి మొహం చూసి మద్దతు ఇస్తున్నాము,” అని ఓవైసీ అన్నారు.
ఓ పార్టీ మరో పార్టీకి మద్దతు ఇవ్వడం వేరు.. ఓ పార్టీ మరో పార్టీ ముఖ్యనేత మొహం చూసి మద్దతు ఇవ్వడం వేరు. రేవంత్ రెడ్డిని చూసే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని మజ్లీస్ అధినేత ఓవైసీ బహిరంగంగా చెప్పడంతో రేవంత్ రెడ్డితో బలమైన స్నేహం ఉందని, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పినట్లే భావించవచ్చు.
బహుశః జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓవైసీ ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చు. లేదా బీఆర్ఎస్ పార్టీకి తాము దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సూచించినట్లు భావించవచ్చు.
సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “నేను బెదిరింపులకు భయపడను. లొంగను. కానీ స్నేహానికి లొంగిపోతాను. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తాను,” అంటూ తగు రీతిలోనే జవాబు చెప్పారు. అయన కొండా సురేఖ లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీలో సీనియర్ నేతల బెదిరింపుల గురించి మాట్లాడినట్లు అనిపించినా, మజ్లీస్ నేతలకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పకనే చెప్పారు.





