మాజీ మంత్రి, అసెంబ్లీలో టీడీపీ ఉపనేత కింజారపు అచ్చన్నాయుడు అరెస్టు సంచలనం సృష్టించింది. 151 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఆయన సిఫార్సు మీద ఒక కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని ఆయన మీద ఆరోపణ. అయితే ఉద్దేశపూర్వకంగానే ఒక బీసీ నేత మీద ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపణ.
అయితే అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికే టీడీపీ కులం కార్డు వాడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆరోపణ. అయితే ఇందుకు టీడీపీ వాదన మరోలా ఉంది. అసెంబ్లీలో అచ్చెన్నాయుడుని ఎదురుకోలేకే అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రభుత్వం ఆయనను పసలేని కేసులో ఇరికించారని వారు అంటున్నారు.
“ప్రముఖ బిసినేత అచ్చంనాయుడు గారి అరెస్ట్ కి సామాజికవర్గకోణం ఎలా ఆపాదిస్తారు అని అడిగే మేధావులు, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసి ప్రజలను మహా విపత్తు నుంచి కాపాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కులపరంగా అన్నప్పుడు నోరు మెదపలేదు ఎందుకని?,” ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు.
గతంలో ఒక రైతు చనిపోయినప్పుడు బీసీ (ముత్రాసి) కి సామాజికవర్గానికి చెందిన రైతును చంద్రబాబు ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని జగన్ ఆరోపించిన ఒక ట్వీటు ను టీడీపీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా కులం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విడదీయలేనిదిగా మారిపోయింది.





