మూడో రోజు నిలబడ్డారు… ఉత్కంఠగా మారిన మ్యాచ్..!

Australia India Test series Latest Newsమొదటి టెస్ట్ మ్యాచ్, రెండవ టెస్ట్ మ్యాచ్ లోని తొలి రెండు రోజులను పూర్తిగా డామినేట్ చేసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులకు ఒక రోజు ఉపశమనం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా లీడ్ ను 97 పరుగులకు పరిమితం చేసిన తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను రాహుల్, పుజారా, రెహానేలు ఆదుకున్నారు. ఒక దశలో మళ్ళీ పేకమేడలా కుప్పకూలుతుందని భావించినప్పటికీ, పుజారా – రెహానేల ద్వయం టీమిండియా పతనాన్ని అడ్డుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 279 పరుగులకు కట్టడి చేయడంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించారు. 63 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడంతో టీమిండియా కన్నా 97 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండవ ఇన్నింగ్స్ లో తొలి 10 ఓవర్ల పాటు వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు 11వ ఓవర్ లో ఎదురుదెబ్బ తగిలింది. అభినవ్ ముకుంద్ 16 పరుగులకు అవుట్ కాగా, మరో ఎండ్ లో రాహుల్ దూకుడుగా బ్యాటింగ్ చేసి, ఈ సిరీస్ లో వరుసగా మూడవ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అయితే ఆ వెనువెంటనే పెవిలియన్ కూడా చేరుకున్నాడు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో వరుసగా విఫలమవుతోన్న విరాట్ కోహ్లి మరోసారి తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరుకున్నాడు. 15 పరుగులు చేసిన కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో, క్రీజులోకి స్పెషల్ అట్రాక్షన్ గా జడేజా వచ్చాడు. అయితే కాసేపటికే జడేజా బౌల్డ్ కావడంతో, మరోసారి వికెట్ల పతనం ప్రారంభం అనుకున్నారు అంతా! ఈ ఒరవడిని అడ్డుకోవడంలో పుజారా – రెహనేల జోడి విజయవంతమైంది. ఈ క్రమంలో పుజారా హాఫ్ సెంచరీ చేసి 79 పరుగులతో నిలువగా, రెహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఇప్పటికి 126 పరుగులతో లీడ్ లో ఉన్న టీమిండియా, దీనిని గనుక 300 పరుగులకు చేయగలిగితే సిరీస్ లో తొలిసారి ఆధిక్యం ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. హీనపక్షంగా మరో 125 పరుగులు చేసినా… 4వ ఇన్నింగ్స్ గనుక ఆసీస్ పై ఒత్తిడి పెంచే అవకాశం దక్కుతుంది. దీంతో నాలుగవ రోజు ఆటలో ఎవరు ఆధిక్యం ప్రదర్శిస్తే… విజయం వారిదేనని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోగలిగితే, ‘విరాట్ అండ్ కో’పై వెలువడిన విమర్శలకు బదులిచ్చిన వారవుతారు.

ADVERTISEMENT
Latest Stories