ఇండియన్ ఐడల్ సీజన్-9 కిరీటాన్ని తెలుగు యువకుడు 25 ఏళ్ళ ఎల్వీ రేవంత్ తన సొంతం చేసుకున్నాడు. పోటీదారులు పీవీఎన్ఎస్ రోహిత్, ఖుదా భక్ష్లతో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో తెలుగు తేజం విజయం సాధించాడు. ఆదివారం ముంబైలో జరిగిన ఫైనల్లో తన గానమాధుర్యంతో, స్టెప్పులతో అందరినీ అలరించాడు. ‘చక్ దే’ సినిమా నుంచి ‘మర్ జాయేన్ యా జీ లూన్ జరా’ పాట పాడి జవాన్లకు అంకితమిచ్చాడు.
అలాగే ‘లడకీ కా గయీ చుల్’ పాట పాడుతూ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఫైనల్లో సత్తా చాటి విజేతగా నిలిచిన రేవంత్ కు ‘ఇండియన్ క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఐడల్ ట్రోఫీని బహూకరించాడు. ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు 25 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్న రోహిత్, యూనివర్సల్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ పోటీలో మరో పోటీదారుడు రోహిత్ రన్నరప్గా నిలిచాడు.
తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200 పాటలు పాడిన రేవంత్ కు “బాహుబలి” సినిమాలో పాడిన ఐటెం సాంగ్ ‘మనోహరి…’ పాట ఎంతో కీర్తి ప్రతిష్టతలను తీసుకొచ్చింది. హిందీ సరిగా పలకలేకపోతున్నాడన్న విమర్శలకు సమాధానంగా… సీజన్ మొత్తం హిందీ పాటలు పాడిన రేవంత్ దేశ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో తెలుగు కుర్రాడు శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్-5 టైటిల్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే.



