జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు నుండి పోటీ చేసే అవకాశం ఉందని పశ్చిమ గోదావరి జిల్లాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జనసేనాని పవన్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి అన్నారు.
తన అన్నయ్య ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చేసినట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా రెండు సీట్ల నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అప్పట్లో చిరంజీవి పశ్చిమ గోదావరిలో పాలకొల్లు, రాయలసీమలోని తిరుపతి నుండి పోటీ చేసారు. అయితే పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో గెలిచారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరిలో ఏలూరు , రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని ఏదైనా ఒక స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు రాయలసీమలో ఆ పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తుంది.



