టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు బెయిల్పై విడుదలై బయటకు రావడంతో టిడిపి పండుగ చేసుకొంటుంటే, వైసీపి నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారు. కానీ రెండూ సహజమే.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడమే టిడిపికి పెద్ద షాక్ అనుకొంటే, ఎంతగా న్యాయపోరాటాలు చేసినా ఇంతకాలం బెయిల్పై లభించకపోవడం, ఆయన జ్యూడిషియల్ రిమాండ్ పొడిగిస్తుండటంతో టిడిపి శ్రేణులు తీవ్ర ఆందోళనతో, నిరాశ నిస్పృహల మద్యనే ఇన్ని రోజులు అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సామాన్య ప్రజలు, రైతులు, ఐటి ఉద్యోగులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఇంకా అనేక వర్గాలకు చెందినవారు కూడా చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు. కనుక టిడిపి శ్రేణులతో సహా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు బయటకు రాగానే పండగ చేసుకొన్నారు. చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో ఈ స్థాయిలో సానుభూతి ఉందని వైసీపి గ్రహించకపోవడం వలన ఈ హడావుడి చూసి వైసీపి జీర్ణించుకోలేక ఇబ్బందిపడుతోంది.
ఆయనకి వైద్య పరీక్షల కోసం కేవలం నెల రోజులు మాత్రమే బెయిల్ మంజూరు అయ్యిందని, గడువు ముగిసిన తర్వాత మళ్ళీ జైలుకి తిరిగి రాక తప్పదని వైసీపి నేతలు వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తూ తమ కడుపు మంట చల్లార్చుకొంటున్నారు.
బెయిల్ షరతుల ప్రకారం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకూడదు. కానీ ఆయనను పార్టీ ముఖ్య నేతలందరూ కలిసి మాట్లాడేందుకు న్యాయపరంగా ఎటువంటి అవరోదమూ లేదు. కనుక వారు తప్పక కలుస్తారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు లేనిలోటు ఏవిదంగా ఉంటుందో వారందరూ స్వయంగా అనుభవించి తెలుసుకొన్నారు కనుక ఇప్పుడు ఆయన రాకతో వారందరూ మళ్ళీ నూతనోతేజం పొందుతారని వేరే చెప్పక్కరలేదు. అలాగే ఆయన కూడా వారికి స్వయంగా దిశానిర్దేశం చేస్తారు కనుక టిడిపి మళ్ళీ కొత్త ఉత్సాహంతో పోరాటాలకు సిద్దమవుతుంది.
చివరిగా ఒక్క మాట: చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించడమే రాజకీయ పరిణామాలలో మార్పుని సూచిస్తోంది. వైసీపి ప్రభుత్వం పట్ల ఢిల్లీ పెద్దల వైఖరిలో మార్పుకి దీనిని తొలి సంకేతంగా భావించవచ్చు. వైసీపి నేతలు కూడా బహుశః ఇది గ్రహించే ఉండవచ్చు కానీ గ్రహించన్నట్లు నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి నెలరోజులే బెయిల్ అంటూ వైసీపి నేతలు ఎంత చులకనగా మాట్లాడుతున్నప్పటికీ వారిలో మళ్ళీ అభద్రతాభావం మొదలైందనే భావించవచ్చు.




