ప్రముఖ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న మీడియా సమావేశం నిర్వహించగా దానిలో ఓ విలేఖరి“చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇంతవరకు జూ.ఎన్టీఆర్ స్పందించలేదు?” అనే ప్రశ్నించగా బాలయ్య “ఐ డోంట్ కేర్… బ్రో ఐ డోంట్ కేర్…” అని సమాధానం చెప్పారు.
గతంలో టిడిపిలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూ.ఎన్టీఆర్ స్పందించకపోవడం పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ బీజేపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆయన అరెస్టుని ఖండించినప్పుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన అరెస్టుని ఖండిస్తున్నప్పుడు, నందమూరి కుటుంబ సభ్యుడిగా జూ.ఎన్టీఆర్ కూడా ఖండించి ఉంటే బాగుండేది. కానీ జూ.ఎన్టీఆర్ స్పందించలేదు.
అందుకు ఆయనను తప్పు పట్టలేము కానీ జూ.ఎన్టీఆర్ స్పందించనందుకు బాలయ్యకి కూడా ఆగ్రహం కలిగి ఉండవచ్చు కనుక ఆయన ‘ఐ డోంట్ కేర్’ అని అనడాన్ని కూడా తప్పు పట్టలేము.
అయితే వీరిరువురి ధోరణి ఎన్టీఆర్ కుటుంబంలో, బాలయ్య, జూ.ఎన్టీఆర్ అభిమానులలో చిచ్చుపెట్టేందుకు వైసీపికి అవకాశం కల్పిస్తోందని చెప్పక తప్పదు. ఇప్పటికే జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియాలో పరస్పరం కత్తులు దూసుకొంటున్నారు.
ఇప్పుడు బాలయ్య ‘ఐ డోంట్ కేర్’ అంటూ అగ్నికి ఆజ్యం పోసిన్నట్లయింది. వైసీపికి టిడిపి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎటువంటి అవకాశం కల్పించకపోయినా తరచూ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ బ్యానర్స్ పెడుతూ టిడిపిలో, ఎన్టీఆర్ కుటుంబంలో, బాలయ్య, జూ.ఎన్టీఆర్ అభిమానులలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుందని అందరికీ తెలుసు.
ఇప్పుడు జూ.ఎన్టీఆర్ మౌనం, బాలయ్య తాజా కామెంట్స్తో వైసీపికి చేజేతులా వైసీపికి అస్త్రాలు అందించిన్నట్లవుతోంది కదా?ఈ గొడవ కారణంగా ఇద్దరి సినిమాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే వైసీపి చేతికి మట్టి అంటకుండా పనైపోతోందన్న మాట!
కనుక జూ.ఎన్టీఆర్ స్పందించడం ఎంత అవసరమో, అభిమానులు, టిడిపి సంయమనం పాటించడం కూడా అంతే అవసరం.



