ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా వెనకేసుకు వస్తున్న సంగతి తెలిసిందే.
అదేవిదంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలని ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వెనకేసుకు వస్తున్నారు.
ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళివచ్చిన మాగుంట రాఘవరెడ్డి గురువారం ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్ళగా, ఆయనకు బాలినేని ఆప్యాయంగా స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు!ఆ కేసు గురించి రాఘవ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసులో మాగుంట కుటుంబాన్ని అన్యాయంగా ఇరికించారు. మాగుంట కుటుంబం గత 50 ఏళ్ళుగా మద్యం వ్యాపారంలో ఉంది. వారు దానిని ఓ వ్యాపారంగానే భావించారు తప్ప ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. రాజకీయ కారణాలతోనే మాగుంట కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అయితే మాగుంట తన నిర్దోషిత్వం నిరూపించుకొని త్వరలోనే ఈ కేసులలో నుంచి తప్పక బయటపడుతుందని నేను నమ్ముతున్నాను,” అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
మద్యం వ్యాపారం అంటేనే అవినీతి, అక్రమాలని అందరికీ తెలుసు. దానిలో నీతి నిజాయితీ అంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఈ నీతి నిజాయితీలను పక్కన పెట్టి, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలుచేస్తానన్న జగన్ ప్రభుత్వమే గత నాలుగున్నరేళ్ళుగా మద్యం వ్యాపారం చేయడం మొదలుపెట్టింది.
మద్యం వ్యాపారాలన్నీ వైసీపీ సిండికేట్స్ చేతులలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వరకు మద్యం వ్యాపారాలలో కూడా వైసీపీ నేతలదే హవా నడుస్తోందని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బయటపడింది.
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఈ కుంభకోణంలో ప్రధానపాత్ర పోషించారంటూ ఈడీ అరెస్ట్ చేసి జైల్లో వేసింది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన మాగుంట రాఘవ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి శాలువా కప్పి సన్మానం చేసి, క్లీన్ చిట్ ఇచ్చారు!
కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇలాగే జైలుకి వెళ్ళి బెయిల్పై బయటకు వస్తే, వైసీపీ కార్యకర్తలు ఆయనకు పూలదండలు వేసి బాజా భజంత్రీలతో బారీ ఊరేగింపుగా ఇంటికి తోడ్కొని వచ్చారు. ఆ తర్వాత ‘టైగర్ ఈజ్ బ్యాక్’ అంటూ కాకినాడలో అనంతబాబు భారీ ఫ్లెక్సీ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.
వివేకా హత్య కేసు, సుబ్రహ్మణ్యం హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులలో నిందితులను వైసీపీ నేతలు వెనకేసుకురావడమే కాకుండా వారికి ఈవిదంగా సన్మానాలు చేస్తుండటం గమనిస్తే ఇవ్వడం గమనిస్తే వైసీపీ నేతల ధోరణి ఏవిదంగా ఉందో అర్దమవుతుంది.



