అద్దాల మేడలో కూర్చొని రాళ్ళేస్తే అంతే మరి!

Bandaru Vamsi Krishna

ఏ ప్రభుత్వామైన సొంత డప్పు కొట్టుకోవడం సాధారణమే. అందుకోసం గత ప్రభుత్వాలను లేదా పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూపుకొంటూ ఉంటాయి. వాటి కంటే తామే చాలా గొప్పగా చేశామని చెప్పుకొంటాయి. అంతటితో ఆగితే పర్వాలేదు. ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అతిశయానికి పోయి ప్రతిపక్షాలపై నోరు పారేసుకొంటేనే సమస్య మొదలవుతుంది.

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇటీవల ఓ సభలో మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, కానీ తన ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య రంగాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్లు అద్భుతంగా మార్చేసిందని అన్నారు.

ADVERTISEMENT

అందుకు ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పుకొంటే చాలా బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేవడమే పొరపాటు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో కంటి చికిత్స చేయించుకోవడాన్ని ప్రస్తావిస్తూ, ప్రతీ చిన్న ఆరోగ్య సమస్యకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ పరుగెడుతుంటారని జగన్‌ ఎద్దేవా చేశారు.

దీంతో టిడిపి నేత బండారు వంశీ కృష్ణ ఘాటుగా స్పందించారు. జగన్మోహన్‌ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎప్పుడు హైదరాబాద్‌ వెళ్ళి వైద్య చికిత్సలు చేయించుకొన్నారో తేదీలతో సహా వివరిస్తూ, మీ ప్రభుత్వం వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసేస్తే మరి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ వెళ్ళి ఎందుకు వైద్యం చేయించుకొంటున్నారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకొంటున్నందుకు మీకేవరికీ సిగ్గనిపించడం లేదా?అని ప్రశ్నించారు. ఆయన ఏమన్నారో క్లుప్తంగా…

  • కోడికత్తితో భుజానికి చిన్న గాటు పడితే మీరు హైదరాబాద్‌ వెళ్ళి చికిత్స చేయించుకోలేదా?
  • మీ మంత్రులు మీ మంత్రి అంజాద్ బాషా, అంబటి రాంబాబు హైదరాబాద్‌ వెళ్ళి కరోనాకి చికిత్స చేయించుకొన్నారు కదా?
  • మీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో, మంత్రి విశ్వరూప్ ముంబైలో, రోజా చెన్నైలో శస్త్ర చికిత్స చేయించుకొన్నారు కదా?
  • మీ మాజీ మంత్రి కొడాలి నానికి కిడ్నీలో రాళ్ళు వస్తే హైదరాబాద్‌కి వెళ్ళి శస్త్ర చికిత్స చేయించుకొన్నారుగా?అలాగే వల్లభనేని వంశీ కూడా పొరుగు రాష్ట్రంలోనే చికిత్స చేయించుకొన్నారు.
  • మా మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లో బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకొని నేటికీ అక్కడే హాస్పిటల్లో ఉన్నారు కదా?

బండారు వంశీ కృష్ణ చదివిన ఈ జాబితాలో వైసీపి నేతల పేర్లు ఇంకా చాలానే ఉన్నాయి. వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, ముంబై, చెన్నై లేదా విదేశాలకు వెళ్ళి శస్త్ర చికిత్సలు చేయించుకోవడాన్ని తప్పు పట్టలేము. కానీ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైద్య రంగం అంత అభివృద్ధి చెందలేదని వైసీపి నేతలే ధృవీకరిస్తున్నట్లుంది కదా?మరి ఈ మాత్రం దానికి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? చెప్పుకొన్నా అద్దాల మేడలో కూర్చోన్నామనే విషయం మరిచి ఎదుటవాళ్ళపై రాళ్ళు విసరడం దేనికి?

ADVERTISEMENT
Latest Stories