చాలాసార్లు చాలా బలహీనంగా కనిపించే చట్టాలు, న్యాయస్థానాలు ఒక్కోసారి చాలా బలంగా తిరుగులేని శక్తిగా మారుతుంటాయి. ఇందుకు తాజా నిదర్శనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో పడటమే.
బండి భగీరథ్ ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు పోక్సో చట్టంలో తీవ్రమైన సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే పోలీసులు అతనిని గత నెల 16న అరెస్ట్ చేసి రిమాండ్ మీద చర్లపల్లి జైలుకి తరలించారు. అప్పటి నుంచి బండి భగీరథ్ జైల్లోనే ఉన్నాడు.
అతను ఇంజనీరింగ్ విద్యార్ధి కనుక పరీక్షలు వ్రాసేందుకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మేడ్చల్- మల్కాజ్గిరి కోర్టు అనేక షరతులతో ఈ నెల 26వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శనివారం మధ్యాహ్నం బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చాడు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే పోలీస్ శాఖపై పూర్తి పట్టు ఉంటుంది. కేసీఆర్ అంతటివాడిని గడగడలాడించిన బండి సంజయ్, కొడుకు విషయంలో నిస్సహాయుడుగా మిగిలిపోక తప్పలేదు. కొడుకుని విడిపించుకునేందుకు న్యాయపోరాటాలు చేస్తున్నా ‘పోక్సో కేసు’ అడ్డుగోడగా నిలుస్తోంది. ఇటువంటివి చూసినప్పుడే మన చట్టాలు, న్యాయస్థానాలు ఎంత శక్తివంతవైనవో తెలుస్తుంటుంది.




