ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల మీడియా ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని, సినీ నటులు, వైసీపి మద్దతుదారులు పోసాని కృష్ణ మురళి, పృధ్వీలను తీవ్రంగా విమర్శిస్తూ చాలా మాట్లాడారు. అసలు బండ్ల గణేష్ హటాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు వచ్చారో…ఆయన వెనక ఎవరున్నారనే సంగతి పక్కన పెడితే, ఆయన వాగుడుతో ఇప్పటికే చీలిపోయున్న సినీ పరిశ్రమలో మరిన్ని చీలికలు సృష్టించడమే కాకుండా యావత్ సినీ పరిశ్రమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే పార్టీలు వారీగా, కులాల వారీగా, చిన్న పెద్ద నిర్మాతలవారీగా, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ వంటి అనేక వర్గాలుగా చీలిపోయుంది. బండ్ల గణేష్ మాటలతో ఆ చీలికలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
సినీ నిర్మాతలు ఎన్ని వందల కోట్లు పెట్టుబడి ఎంత పెద్ద హీరోలను పెట్టి సినిమాలు తీసినప్పటికీ, ఏపీలో సినిమాలు ఆడించుకోలేకపోతే తీవ్రంగా నష్టపోతారని ఇప్పటికే నిరూపితమైంది. ఇటువంటి పరిస్థితులలో బండ్ల గణేష్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడటం వలన యావత్ సినీ పరిశ్రమకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టారని చెప్పక తప్పదు. ఆయన తీసే సినిమాలకు ఏపీలో ఎలాగూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాటితో పాటు సినీ పరిశ్రమలో ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు లేదా ఆయన సినిమాలలో నటించే ఇతర నటీనటులకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు.
ప్రజలను తమ సినిమాలతో వినోదింపజేసేవారు ఈవిదంగా కోరుండి కష్టాలు, నష్టాలు తెచ్చుకొని బాధపడటం దేనికి?ఇప్పటికే సినీ పరిశ్రమ కూడా దీనికి భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇంకా అవసరమా?



