ఆర్.కృష్ణయ్య బీసీల హక్కుల కోసం చాలా కాలం పోరాటాలు చేశారు. అందుకు ఆయనని అభినందించాల్సిందే. డిగ్రీ పూర్తి చేసిన యువత మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఏవిదంగా అనుకుంటారో అలాగే ఆర్.కృష్ణయ్య కూడా బీసీల నేతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత మంచి రాజకీయ ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకున్నారు. అదేమి తప్పు కాదు.
ఇంజనీరింగ్ కాలేజీలలో కాంపాస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఐటి కంపెనీలు మెరిట్ స్టూడెంట్స్ ని సెలక్ట్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చిన్నట్లే, ఆయన కూడా రాజకీయ పార్టీల దృష్టిలో ‘మెరిట్ స్టూడెంట్’గా గుర్తింపు పొందారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
కనుక రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఆర్.కృష్ణయ్యని తెలంగాణ టీడీపీలోకి తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. అలాంటి జాక్పాట్ చాలా అరుదుగా లభిస్తుంది. దాంతో ఆయన జీవితమే మారిపోయింది.
ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయినప్పటికీ ఆయన గెలిచారు. బీసీల నాయకుడుగా ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి చేసి రాజకీయ నాయకుడుగా అలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆర్.కృష్ణయ్య ధోరణి పూర్తిగా మారిపోయింది. అంతవరకు బీసీల నాయకుడుగా ఉన్న ఆయన పక్కా రాజకీయ నాయకుడుగా మారిపోయారు.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గెలవడంతో కేసీఆర్కి దగ్గరయ్యారు. ఆ పార్టీలో చేరకపోయినా కేసీఆర్కి మద్దతు ఇచ్చేవారు.
2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందే ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టికెట్ దక్కించుకొని మిర్యాలగూడ నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
ఏపీలో బీసీలను ఆకట్టుకునేందుకు జగన్ ఆయనని పిలిచి అప్పనంగా రాజ్యసభ సీటు ఇవ్వడంతో తంతే బూరెల గంపలో పడిన్నట్లయింది.
2024 ఎన్నికలలో వైసీపీ ఓడిపోయాక కొందరు రాజకీయ పెద్దల సూచనతో ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేసి, బీజేపిలో చేరిపోయి మళ్ళీ ఆ సీటుని దక్కించుకోబోతున్నారు.
ఆర్.కృష్ణయ్య బీసీల ప్రయోజనాలకు పోరాడుతున్నానని చెపుతూ వారి అండదండలతో రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, ఆ గుర్తింపుని ఈ విదంగా తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అర్దమవుతూనే ఉంది.
కనుక ఆయన బీసీల కోసం పనిచేస్తున్నారా లేక బీసీలను ఆయన వాడుకున్నారా?బీసీల దన్నుతో ఈ స్థాయికి ఎదిగిన తర్వాత అయినా వారి కోసం ఆయన ఏమైనా చేశారా? చేస్తారా? లేక రాజ్యసభలో వెనుక బెంచీలలో కూర్చొని తన ఎదుగుదలతో సంతోషపడుతూ కాలక్షేపం చేసేస్తారా? అనే ప్రశ్నలకు ఆయనే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.