ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన “భరత్ అనే నేను” సినిమా టీజర్ విడుదలై 24 గంటలు పూర్తయ్యింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో, యూ ట్యూబ్ తో పాటు, డిజిటల్ వ్యూస్ లో ‘భరత్ అనే నేను’ ఆల్ టైం రికార్డ్ సాధించి ఫ్యాన్స్ కు కావాల్సిన ఆనందాన్ని మిగిల్చింది. ఒక్క యూ ట్యూబ్ లోనే 8.6 మిలియన్ క్లిక్స్ అందుకుని, అంతకుముందు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ పేరిట ఉన్న 6.4 మిలియన్ క్లిక్స్ ను భారీ తేడాతో దాటింది.
ఇక ఓవరాల్ గా ఫేస్ బుక్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా క్లిక్స్ ను పరిశీలిస్తే… 11.5 మిలియన్స్ అంటే ఒక కోటి పదిహేను లక్షల క్లిక్స్ ను అందుకుని తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ దిశగా చిత్ర యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మహేష్ గత సినిమా ‘స్పైడర్’ ఈ టీజర్ స్థాయి నుండే ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరచగా, ‘భరత్ అనే నేను’ మాత్రం అందుకు విరుద్ధంగా పాజిటివ్ ట్రెండ్ లో పైకేల్తోంది. ఒక్క ప్రిన్స్ ఫ్యాన్స్ నే కాదు, ఇతర సినీ, రాజకీయ అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఆ ప్రభావంతోనే ‘భరత్ రామ్’ ముఖ్యమంత్రిగా ఉన్న మహేష్ ఫోటోను ఎడిట్ చేస్తూ… పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, జగన్ మోహన్ రెడ్డి వంటి వారితో పోస్టర్లను రూపొందిస్తూ సోషల్ మీడియాలో వారి వారి అభిమానులు వదులుతున్నారు. ‘పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటేనా..!’ అన్నది ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ నుండి ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఒక్క ఫ్యాన్సే కాదు ట్రేడ్ వర్గాలు కూడా ఇదే రకమైన భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ ఇలాంటి సినిమా చేసి ఉంటే…! అన్న కోణంలో ఆలోచనలు చేస్తున్నారు.



