ఏపీలో భారత్‌ చైతన్య యువజన పార్టీ… ఎవరి కోసం?

Bharata Chaitanya Yuvajana Party Andhra Pradeshసాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు నేతలు పార్టీలు మారుతుంటారు. అదే సమయంలో కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని భావిస్తున్నప్పుడు లేదా ఓ కులం, వర్గం అండ చూసుకొని కొత్తపార్టీలతో దిగేవారు కొందరుంటారు. ఒక్కోసారి ప్రత్యర్ధ పార్టీల ఓట్లను చీల్చాలనుకొన్నప్పుడు కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటాయి. ఏపీలో రాజకీయశూన్యత లేదు. కానీ మిగిలిన రెంటికీ అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT

ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ఆదివారం గుంటూరు శివారులో నాగార్జున యూనివర్సిటీ వద్ద బహిరంగసభ నిర్వహించి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలు, మైనార్టీల కోసం ‘భారత్‌ చైతన్య యువజన పార్టీ’ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తాను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పర్యటించి పలువురు మేధావులు, వివిద వర్గాల ప్రజలను కలిసిన తర్వాత పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకొన్నానని చెప్పారు. అన్ని పార్టీలు బడుగు బలహీనవర్గాలు, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వాడుకొంటున్నాయి తప్ప వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నించడం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాక్షసరాజ్యం, రాక్షస పాలన సాగుతోందని, దానిని అంతమొందించకపోతే ప్రజల జీవితాలు మరింత దుర్భరం అవుతాయని అందుకే ప్రజల తరపున పోరాడేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నానని అన్నారు. వైసీపీలో పై నుంచి క్రింది వరకు అందరూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నారని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎన్నికలలో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయానని కానీ అంతమాత్రన్న తాను ఓటమిని అంగీకరించలేదన్నారు. నిజానికి అప్పటి నుంచే అసలైన రాజకీయ జీవితం మొదలైందని తాను భావిస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని, భావస్వారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు ఉంటాయని రామచంద్ర యాదవ్ చెప్పారు.

ఏపీలో వైసీపీ, టిడిపి రెండూ చాలా బలంగా ఉన్నాయి. ఈసారి జనసేన మరింత బలపడింది. దానితో బిజెపి కలిసి వెళ్తోంది. కనుక ఆ రెండింటి కూటమి మరింత బలంగా మారుతుంది. ఈ పరిస్థితులలో మరో కొత్త పార్టీకి ఆస్కారమే ఉండదు. కానీ రామచంద్ర యాదవ్‌ కొత్త పార్టీతో వచ్చారంటే బహుశః వైసీపీ ఓట్లు చీల్చేందుకే వచ్చిన్నట్లు అనుమానించాల్సి ఉంటుంది.

గతంలో ఆయన జనసేనలో ఉన్నారు కనుక ఆయన వెనక జనసేన ఉన్నా ఆశ్చర్యం లేదు. లేదా బిఆర్ఎస్ పార్టీతో ఏపీలో అడుగుపెట్టేందుకు సంకోచిస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఉన్నా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories