ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు చెప్పగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్టీ వర్గీకరణని వీలైనంత త్వరగా అమలుచేయాలని మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తామని ఆ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలోనే ప్రకటించారు కూడా.
అయితే ఇల్లలకాగానే పండుగ కాదన్నట్లు సుప్రీంకోర్టు, ప్రభుత్వాలు ఒప్పుకున్నా దీనిపై ఎస్సీ, ఎస్టీలలో కొన్ని వర్గాలు ఒప్పుకోవడం లేదు.
మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ వారిలో ఒకరు. సుప్రీంకోర్టు తీర్పుని ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే కాక దానిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు మరో ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించారు కూడా.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్గీకరణ అమలుచేస్తే టిడిపి కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక సిఎం చంద్రబాబు నాయుడు దాని అమలుకి తొందరపడటం లేదు.
అయితే ఊహించిన్నట్లే అప్పుడే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లో దళిత సంఘాలు బంద్కు పిలుపిచ్చాయి. వర్గీకరణ వలన దళితుల మద్య చీలిక ఏర్పడుతుందని దాని వలన మరింత బలహీన పడతామని వాదిస్తూ దళిత సంఘాలు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు.
దీంతో పలు ప్రాంతాలలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే బంద్ ప్రభావం పెద్దగా కనపడలేదు కానీ ఇది ఇటువంటి ఉద్యమాలకు ఆరంభం కావచ్చు. కానీ వర్గీకరణ అమలు చేయడంలో ఆలస్యం చేస్తే మందకృష్ణ మాదిగ మళ్ళీ పోరాటాలు మొదలుపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచకుండా ఉండరు. కనుక ఈ విషయంలో ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి కనిపిస్తోంది.




