కొచ్చిలో 2017 ఫిబ్రవరి 17న మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ హీరోయిన్ భావన లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. షూటింగ్ ముగించుకుని కారులో ఇంటికి వెళ్తున్న ఆమెను అడ్డగించి, లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడుగా భావించే ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు.
ఇదిలా ఉండగా… మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (అమ్మ)లో దిలీప్ కు తిరిగి సభ్యత్వం కల్పించారు. దీనిని నిరసిస్తూ బాధిత హీరోయిన్.. ‘అమ్మ’లో తన సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఆమెకు మద్దతుగా ముగ్గురు ప్రముఖ నటీమణులు రీమా కళింగల్, రెమ్య నంబిసన్, గీతూ మోహన్ దాస్ కూడా తమ సభ్యత్వాలను వదులుకున్నారు. ఈ విషయమై బాధిత హీరోయిన్ మాట్లాడుతూ, దిలీప్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ‘అమ్మ’కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, అతన్ని కాపాడేందుకు అసోసియేషన్ లో ప్రముఖులు యత్నిస్తున్నారని ఆరోపించింది.
అందుకే ఇలాంటి అసోసియేషన్ లో కొనసాగడం అనవసరమని భావించి తన సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పింది. మరో నటి గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ… ఎదురు ప్రశ్నించని వాళ్లని, ఏది చెబితే అది గుడ్డిగా పాటించే వారినే ‘అమ్మ’ నాయకత్వం దగ్గరకు తీసుకుంటుందని, తాము నలుగురం తమ నిర్ణయంపై గట్టిగా నిలబడి పోరాడతామని స్పష్టం చేసింది. ఇంకో నటి రీమా స్పందిస్తూ… సినీ పరిశ్రమలో తర్వాతి తరం మహిళా నటులైనా ఆత్మవిశ్వాసంతో ఉండాలని, సర్దుకుపోవాలనే ఆలోచన లేకుండా రాణించాలనే ఉద్దేశంతోనే తన సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు.



