రాయలసీమలో మంచి పట్టు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే భూమా నాగిరెడ్డి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు చిత్ర పరిశ్రమతోనూ భూమాకు మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ లోని ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మంచి మిత్రులు కాగా, మరో సీనియర్ నటుడు మోహన్ బాబుతో భూమా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అలాగే దర్శకులు రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజతో కూడా సన్నిహితంగా ఉండేవారు. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్స్ సంస్థ పేరుతో భూమా పలు చిత్రాలను కూడా నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో ‘నా కూతురు’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన భూమా, ఎక్కువగా సుమన్ కథానాయకుడిగా నటించిన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. దీంతో భూమా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న వారిలో పొలిటికల్ వర్గాలే కాక, టాలీవుడ్ వర్గీయులు ఉన్నారు.



