తిరుమల భక్తులకు కర్రలు… అఫ్‌కోర్స్ జగన్‌ స్టికర్స్‌తోనే!

bhumana-karunakar-reddy-TTDగత శుక్రవారం రాత్రి తిరుమల మెట్ల మార్గంలో లక్షిత అనే ఆరేళ్ళ బాలికను ఓ చిరుతపులి చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. మెట్ల మార్గం వెంబడి అడవులలో చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు వంటి క్రూరమృగాలు సంచరిస్తుంటాయని టీటీడీకి, అటవీశాఖకు తెలియనిది కాదు. అయినా ఇంతవరకు ఇటువంటి ఘటనలు జరుగలేదు కనుక ఎటువంటి భద్రతచర్యలు చేపట్టలేదు.

ADVERTISEMENT

చిన్నారి లక్షిత చిరుతపులికి బలైపోవడంతో భక్తులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి మేల్కొని కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. మెట్లదారిలో మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతించడం, సాయంత్రం 6 గంటల వరకే పెద్దవారిని అనుమతించడం, మెట్ల మార్గంలో సిబ్బందిని నియమించడం వంటి కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు.

మెట్లమార్గంలో నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకొంటారు. కనుక వారిని నియంత్రించడం కోసం దివ్యదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గించేశారు. అలాగే ఇకపై మెట్ల మార్గంలో కొండపైకి వెళ్ళే భక్తులకు ‘నాణ్యమైన చేతికర్రలు’ ఇవ్వాలని కూడా నిర్ణయించామని చెప్పారు. ఒకవేళ వన్యమృగాలు వారిపై దాడికి ప్రయత్నిస్తే ఆ కర్రలతో వాటిని ఎదుర్కొని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

దీనిపై టిడిపి స్పందిస్తూ, “తిరుమలకు కాలినడకన వెళ్ళేవారికి కర్ర బదులు తమరి ఆస్థాన ఆయుధం గొడ్డలి ఇవ్వు బ్రో,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. “నాణ్యమైన చేతి కర్రల సరఫరా, కొనుగోలు పేరుతో కమీషన్‌ కొట్టేయకుండా ఉంటారా?వాటికి వైసీపీ రంగులు వేయకుండా ఉంటారా? వాటికి జగన్‌ స్టికర్స్ అంటించకుండా ఉంటారా?” అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయినా భక్తులకు అతిసమీపంలో క్రూరమృగాలు సంచరిస్తున్నాయని తెలిసి ఉన్నప్పుడు, మెట్ల మార్గం వెంబడి శాస్విత ప్రాతిపదికన ఫెన్సింగ్ నిర్మించడమో లేదా ఎక్కడికక్కడ తుపాకులు కలిగిన పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమో చేయాలి కానీ భక్తులకు కర్రలు ఇచ్చి చిరుతలు, ఎలుగులు వస్తే వాటితో పోరాడి మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. అదృష్టం బాగుంటే తిరుమలకి రండి లేకుంటే నేరుగా పైకే పొమ్మన్నట్లు వ్యవహరించడం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంటే దానిని ఉపయోగించుకొని భక్తులకు భద్రత కల్పించే ప్రయత్నం చేయకుండా వారి చేతికి కర్రలు ఇచ్చి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండని చెప్పడం ఏమిటి?

ADVERTISEMENT
Latest Stories