నాచురల్ స్టార్ నాని విజయవంతంగా హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్ 2’ నుండి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు సంజన, నూతన్ నాయుడు, కిరీటీలు ముగ్గురు ఎలిమినేట్ కాగా, వీరు బయటకు రాగానే మీడియా కంటికి హాట్ కేకుల్లా కనపడుతున్నారు. ఇలా ‘బిగ్ బాస్’ హౌస్ నుండి బయటకు వస్తున్నారో లేదో అలా రెండు, మూడు రోజుల పాటు వరుసగా అన్ని మీడియాలలో వీళ్ళవే ఇంటర్వ్యూలు!
సాధారణ ప్రజల జాబితా నుండి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంజన, నూతన్ నాయుడులను మీడియాలు వదలడం లేదంటే, బిగ్ బాస్ హౌస్ కున్న ప్రాధాన్యతను చాటిచెప్తున్నాయి. ఇలా కామన్ మ్యాన్ జాబితా నుండి బిగ్ బాస్ లోకి ఎంటర్ అయినా, ఎలిమినేషన్ తర్వాత మీడియా ఇస్తోన్న హైప్ కు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. గత వారం రోజులుగా నూతన్ నాయుడు చెప్పిన పవన్ కళ్యాణ్ సంగతులతో మీడియా వర్గాలన్నీ హోరేత్తించగా, తాజాగా కిరీటీ వంతు వచ్చింది.
ఇప్పటికే పలు సినిమాలలో కమెడియన్ గా రాణించిన కిరీటీ, తన సినీ ప్రస్థానాన్ని, పయనాన్ని చెప్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే… ఆదివారం నాడు సాయంత్రం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తితో మీడియా వర్గాలన్నీ నిరీక్షిస్తున్నాయి. అలా బయటకు వచ్చిన వారిని ముందుగా తామే ఒడిసి పట్టుకోవాలన్న దృష్టితో వారి వెంట పడడం మీడియా వంతవుతోంది.



