కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ గ్రహించాయి కానీ ప్రాంతీయ పార్టీలే…

BJP Congress

దేశంలో ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి శ్రీరామరక్షగా నిలుస్తోందని అందరికీ తెలుసు. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు కూటమిని నిలబెట్టి సత్ఫలితాలు సాధించారు. కేసీఆర్‌ కూడా ఇది బాగానే గ్రహించారు. కానీ ఆయన ప్రధాని పదవికి ఆశపడి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు.

ADVERTISEMENT

దేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలో బలమైన ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి.

దేశంలో యూపీ, బిహార్, రాజస్థాన్, మద్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌ వంటి మరికొన్ని రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నాయి.

కానీ వీటన్నిటి మద్య ఐఖ్యత లేకపోవడం వలన లేదా అవన్నీ కలవకుండా బీజేపీ అడ్డుకొంటుండటం వలన సమైఖ్యశక్తిగా అవతరించలేకపోతున్నాయి.

ఉదాహరణకు మొదట ఢిల్లీకే పరిమితమైన ఆమాద్మీ పార్టీ తర్వాత పంజాబ్‌కు విస్తరించి అధికారంలోకి రాగలిగింది. కనుక దానిని లిక్కర్ స్కామ్‌ కేసుతో కేంద్రం కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్‌ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తే ఆయనను అదే కేసుతో ఏవిదంగా కట్టడి చేసిందో అందరూ చూస్తూనే ఉన్నారు.

అలాగే బిహార్‌లో నితీష్ కుమార్‌ని తనవైపు తిప్పుకొని ఎన్దీయేలో చేర్చుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు లభించకుండా, ఇండియా కూటమికి ఎంపీ సీట్లు పెరగకుండా చేశారు.

అదే విదంగా ఏపీలో జగన్మోహన్‌ రెడ్డిని కేసులతో కట్టడి చేస్తూనే, టిడిపి, జనసేనలను ఎన్డీయేలో చేర్చుకొని బీజేపీకి ఎంపీ సీట్లు పెంచుకునే ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇక ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల అధినేతలు ప్రధాని కావాలనే దురాశ పడుతుండటం వలన కూటమి బలపడలేకపోతుంటే, బీజేపీ కూడా వారి కూటమి బలపడకుండా ఈవిదంగా అడ్డుపడుతూ తనకు ఎదురు లేకుండా జాగ్రత్తపడుతోంది.

2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీయేతర రాష్ట్రాలలో కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 139 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. ఆ తర్వాత నుంచే కాంగ్రెస్ పార్టీ తన ‘మూస వ్యూహాలు’ పూర్తిగా మార్చేసుకొని ఒక్కో రాష్ట్రానికి తగ్గట్లుగా వేర్వేరు వ్యూహాలు రూపొందించుకొని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో విజయం సాధించింది.

ఇప్పుడు ఏపీలో కూడా వైఎస్ షర్మిలని దింపడం కూడా అదేవిదంగా చూడవచ్చు. తద్వారా తన ఎంపీ సీట్లు పెంచుకోబోతోంది. కనుక గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్‌, మిత్రపక్షాలకు మరికొన్ని ఎంపీ సీట్లు ఎక్కువే రావచ్చు.

బీజేపీ కూడా ఇది గ్రహించినందునే ఈసారి 370-400 సీట్లు టార్గెట్ పెట్టుకొని ఓ పక్క ఇండియా కూటమిని చీల్చి ఎన్డీయేను బలోపేతం చేసుకొంటూ, దేశంలో బీజేపీయేతర పార్టీలు దగ్గరవకుండా వాటిని దూరంగా ఉంచేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.

కనుక కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఈ రాజకీయ లెక్కలు బాగానే అర్దం చేసుకున్నాయని చెప్పవచ్చు. దేశంలో ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ లెక్కలు అర్దమైనప్పటికీ ఒక్కటిగా నిలబడలేకపోతున్నాయి. కనుక వాటన్నిటినీ మళ్ళీ కలిపి బలంగా నిలబెట్టే నాయకుడు వచ్చే వరకు దేశంలో బీజేపీకి ఎదురు ఉండకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories