ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తుందనే రెండు నెలల క్రితం అందరూ అనుకొనేవారు. అటు ప్రజలలో, ఇటు పార్టీలో కూడా అంత నమ్మకం కలిగించిన బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేసుకొన్నప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయిపోయింది.
దానికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ జోరుగా చేస్తున్న ప్రచారంతో బీజేపీ విశ్వసనీయత ఇంకా దెబ్బ తింది. సర్వేలన్నీ కూడా బీజేపీకి కేవలం 5-6 సీట్లు మాత్రమే వస్తాయని మూడో స్థానానికే పరిమితమవుతుందని తేల్చి చెప్పేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి స్వయంగా పవన్ కళ్యాణ్ని కలిసి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. కానీ అప్పుడూ బీజేపీ, జనసేనలు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో దేనిదారి దానిదే అని అందరూ భావిస్తున్నారు.
కానీ ఈరోజు ఉదయం కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తలు కూకట్పల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ‘జనసేనకు కూకట్పల్లి సీటు ఇస్తే సహించేది లేదంటూ….” నిరసనలు తెలియజేశారు.
అంటే తెలంగాణలో బీజేపీ, జనసేనలు మద్య పొత్తులు కుదిరాయా? సీట్ల సర్దుబాటు చేసుకొన్నాయా?వాటిలో భాగంగానే కూకట్పల్లి బీజేపీ సీటుని జనసేనకు ఇచ్చేందుకు అంగీకరించిందా?జనసేనతో సీట్ల సర్దుబాటు కోసమే బీజేపీ ఇంతవరకు తుది జాబితా విడుదల చేయలేదా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు ఉందనుకొంటే, మరి ఏపీలో పొత్తుల సంగతేమిటి?అప్పుడు బీజేపీతో కలిసి పనిచేస్తుందా? టిడిపితో కలిసి పనిచేస్తుందా?లేక మూడూ కలిసి పోటీ చేస్తాయా?అనే కొత్త ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు తెలంగాణలో పొత్తుల సంగతి తెలియాలి.






