బిజెపి లక్ష్యం అదే… అందుకే ఈ మార్పులు చేర్పులు?

Narendra_Modi_Amit_Shahఒకప్పుడు బిజెపి సిద్దాంతాలను నమ్మేవారితోనే పార్టీ నిండి ఉండేది. అయితే మోడీ-అమిత్‌ షాల హయం ప్రారంభమైన తర్వాత సిద్దాంతలతో పనిలేదు. ఎన్నికలలో గెలిచేశక్తి ఉంటే చాలనే కొలమానంతో అన్ని పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించడం మొదలుపెట్టింది.

బిజెపిలో వచ్చిన మరో మార్పు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు కట్టబెడుతుండటం. ఇదివరకు బిజెపిలో చాలాకాలంగా ఉన్నవారికి మాత్రమే కీలక పదవులు లభించేవి. కానీ ఇప్పుడు వారి సీనియారిటీని బట్టి కాకుండా, కొత్తగా వచ్చినా వారి శక్తిసామర్ధ్యాలను బట్టి పదవులు లభిస్తున్నాయి.

ADVERTISEMENT

ఉదాహరణకు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బిజెపిలో చేర్చుకోవడమే ఓ విడ్డూరం అనుకొంటే, ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం మరో విడ్డూరం. ఆయన సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నందున రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ, సామాజిక తదితర పరిస్థితులపై మంచి అవగాహన కలిగి ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక రెండు రాష్ట్రాలలో బిజెపి ఏవిదంగా ముందుకు సాగాలనే దానిపై బిజెపి అధిష్టానానికి తగిన సలహాలు, సూచనలు, వ్యూహాలు అమలు చేయడానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకొన్నట్లు భావించవచ్చు.

అయితే రాష్ట్ర స్థాయిలో బిజెపి విశ్వసనీయతను స్వయంగా దెబ్బ తీసుకొంటూ ఢిల్లీలో కూర్చొని చక్రం తిప్పితే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రాగలదా? అంటే కాదనే చెప్పొచ్చు.

ఏపీలో అధికార వైసీపీతో బిజెపి పొత్తులు లేవు. అదేవిదంగా తెలంగాణలో బిఆర్ఎస్తో కూడా లేవు. కనుక ఈ రెండు పార్టీలు, ప్రభుత్వాలపై కత్తులు దూస్తూ ‘మేము శత్రువులమని’ ప్రజలను భ్రమింపచేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.

అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్‌ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా కాపాడుతున్నది… అక్రమాస్తులు, వివేకా కేసులలో కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే అని అందరికీ తెలుసు. కనీసం అమరావతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సిఎం జగన్మోహన్ రెడ్డికి గట్టిగా చెప్పకుండా మూడు రాజధానులు ఆట ఆడుకొనేందుకు అనుమతిస్తోంది.

తెలంగాణలో కూడా అధికార బిఆర్ఎస్-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. ఆ వాదనలకు తగ్గట్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితని కాపాడుతోందని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వంటి సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ని మట్టి కరిపించేందుకు సిద్దమవుతున్న బండి సంజయ్‌ని హటాత్తుగా ఆ పదవిలో నుంచి తప్పించేసి మృదుస్వభావి అయిన కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది.

కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి తన విశ్వసనీయత ప్రశ్నార్దకంగా మార్చుకొని అధ్యక్షులని మార్చి ఏం ప్రయోజనం? కిరణ్‌ కుమార్‌ రెడ్డివంటివారిని ఢిల్లీలో పక్కన కూర్చోపెట్టుకొని ఏం ప్రయోజనం?అంటే బిజెపి అధిష్టానం లక్ష్యం రాష్ట్రాలలో అధికారంలోకి రావడం కాదు… లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘అటూ ఇటూ అయినా’ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం. అందుకనుగుణంగానే ఈ మార్పులు చేర్పులు, సరికొత్త ఆలోచనలు, విధానాలు అని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories