లెక్కలు చెప్పారు… మరి బొక్కలు చెప్పరే… బిజెపి తీరిది!

BJP president amith Shah speech in rajamahendravaramఆదివారం నాడు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు చాలా చేసామంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని.., ఏపీలోని జాతీయ రహదారులకు 65 వేల కోట్లు కేటాయించామని.., ఎయిమ్స్ కు కేంద్రం 1500 కోట్లు ఇచ్చామని.., పేదలకు ఇళ్లు నిర్మించడంలో భాగంగా కేంద్రం చేపట్టిన పథకంలో ఏపీకి లక్షా 93 వేల ఇళ్లను కేటాయించామని.., అమృత్ పథకంలో భాగంగా దేశంలోని 31 పట్టణాలను గుర్తిస్తే అందులో ఎక్కువ పట్టణాలు ఏపీలోనే ఉన్నాయని.., స్మార్ట్ సిటీ పథకంలో విశాఖ, కాకినాడలకు స్థానం కల్పించామని చెప్పుకొచ్చారు.

అలాగే, అమరావతికి ప్లాన్ గీయకముందే 1500 కోట్ల రూపాయలు ఇచ్చామని.., నెల్లూరులో కామధేను ప్రాజెక్టుకు 3,000 కోట్లు ఇచ్చామని.., 22 వేల కోట్ల ఇండస్ట్రియల్ పార్క్ ను భారత ప్రభుత్వం ఏపీలో పెట్టనుందని.., 3,266 కోట్లతో విశాఖలో నేవీ పరిశ్రమ పెట్టనున్నామని.., 25000 కోట్లతో హెచ్పీసీఎల్ రిపైనరీ వైజాగ్ లో పెట్టనున్నామని.., విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.., అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని నెలకొల్పనున్నామని.., దానితో పాటు పెట్రోలియం యూనివర్సిటీకి విశాఖను ఎంపిక చేశామని… ఇలా దాదాపు జాబితా చాలా పెద్దగానే ఉంది.

ADVERTISEMENT

అయితే అమిత్ షా గారు చెప్పిన ఈ అభివృద్ధి పధకాలలో ఏపీకి ఎంత మొత్తంలో నిధులు మంజూరు చేసారో కూడా చెప్పినట్లయితే బిజెపి చిత్తశుద్ధి బయటపడేదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఎయిమ్స్ కు శంకుస్థాపన జరిగిన విషయం వాస్తవమే, కాని నిధులు మంజూరు చేయలేదు. అలాగే రాష్ట్రానికి 1.93 ఇళ్ళ కేటాయింపు జరిగిన మాట నిజమే, అయితే ఇప్పటివరకు ఒక్క గృహం కూడా సిద్ధం కాలేదు. ఇక, పోలవరం ప్రస్తావన గురించి మాట్లాడకపోవడం మరింత ఉత్తమం. జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణించిన పోలవరానికి 100 కోట్లు ఏ మూలకు వస్తాయో సదరు బిజెపి ప్రతినిధులే ఆలోచించుకోవాలి.

ఇలా అమిత్ షా ప్రస్తావించిన ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషణ చేసుకుంటే, చెప్పిన ఈ లెక్కలలో “బొక్కలే” ఎక్కువగా కనపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కేటాయింపులు అయితే జరుగుతున్నాయన్న విషయం ఎంత వాస్తవమో, దానికి తగిన విధంగా నిధులు మంజూరు కావడం లేదన్నది కూడా అంతే వాస్తవం. ఇవి కాకుండా రైల్వే జోన్, ప్రత్యేక హోదాల ఊసే ఎత్తకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటో కూడా బహిరంగ పరచాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories