జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అందిపుచ్చుకొని ఆయనపై యుద్ధానికి దిగడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయవాతావరణం వేడెక్కిపోయింది.
వాలంటీర్ల వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం ఏవిదంగా దుర్వినియోగం చేస్తోందో వివరిస్తూ, పవన్ కళ్యాణ్ కేంద్ర ఇంటలిజన్స్ ప్రస్తావన కూడా చేశారు. రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులు, నిసహాయ మహిళల వివరాలు వాలంటీర్ల ద్వారా అసాంఘిక శక్తుల చేతికి వెళ్తోందని, ఆ కారణంగా రాష్ట్రంలో వేలాదిమంది మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
కేంద్ర ఇంటలిజన్స్ సంస్థ ద్వారా ఈవిషయం తనకు తెలిసిందని చెప్పారు. అయితే కేంద్రం దీనిని ధృవీకరించలేదు కానీ ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు, జాతీయ బిజెపి కార్యవర్గ సభ్యుడు సోమూ వీర్రాజు తొలిసారిగా పవన్ కళ్యాణ్కు బాసటగా నిలుస్తూ మాట్లాడారు.
“జగన్ ప్రభుత్వం వైసీపీ రాజకీయ అవసరాల కోసమే ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున రూ.4,000 కోట్లు ఖర్చు చేసింది. మరో వెయ్యి కోట్లు ఖర్చు చేయబోతోంది. బిజెపి ప్రచారం కోసం దేశ్ ప్రముఖ్ లను నియమించుకొంది. వారు స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తుంటారు. కానీ జగన్ ప్రభుత్వం వాలంటీర్లపై ప్రజాధనం ఖర్చు చేస్తూ వారిని వైసీపీని గెలిపించేందుకు ఉపయోగించుకొంటోంది. రాజకీయ దురుదేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే,” అని అన్నారు.
ఏపీ బిజెపికి అధ్యక్షురాలిగా నియమితురాలైన దగ్గుబాటి పురందేశ్వరి ఇంకా ఇంతవరకు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా మహిళా నేతగా వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వెలిబుచ్చిన అభిప్రాయాలపై తన స్పందన తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న ఓ అనూహ్యమైన సమస్యను బయటపెట్టారు.
అందుకు అధికార వైసీపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని చాలా తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. నేటికీ జనసేన బిజెపికి మిత్రపక్షంగానే ఉంది. పైగా పవన్ కళ్యాణ్ మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. కనుక దగ్గుబాటి పురందేశ్వరి తప్పక స్పందించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలను టిడిపి కూడా నిశితంగా గమనిస్తోంది. అది కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.
—



