ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ‘ప్రజాపోరు’లో భాగంగా బుదవారం వైఎస్సార్ జిల్లాలోని యర్రగుంట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.
“ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించినా వారిని వేధిస్తున్నాడు. నన్ను కూడా హత్యచేయిస్తానని బెదిరిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులకు నేను భయపడను అందుకే ఇక్కడ మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతునాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ ‘కింగ్ పిన్’ అని సుప్రీంకోర్టు చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ కేసు విచారణ జరిగితే జగన్ బండారం కూడా బయటపడుతుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బరితెగించి వ్యహరిస్తున్నారు. వారిని జనం మీదకి పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నవి, జగన్ ప్రభుత్వం తీరు అన్నిటినీ నిశితంగా గమనిస్తూనే ఉంది. సరైన సమయంలో జగన్కి చెక్ పెడుతుంది. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డిని బాధపెట్టి జగన్ ఏం సాధించారు. ముఖ్యమంత్రి సొంత చెల్లెళ్ళకే భద్రత, భరోసా లేకపోతే ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా కల్పించగలదు జగన్ ప్రభుత్వం?” అని ఆదినారాయణ రెడ్డి గట్టిగా నిలదీశారు.
తెలంగాణపై మొదట బిజెపి పెద్దగా పెట్టలేదు. కానీ ఇప్పుడు పెట్టి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు అమలుచేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బిజెపి తదుపరి లక్ష్యం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. బహుశః ఈవిషయం సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించే ఉంటారు. అందుకే వచ్చే ఎన్నికలలో 175 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని తద్వారా ఆంధ్రప్రదేశ్లో బిజెపికి స్థానం లేదని నిరూపించాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. కానీ మనం కోరుకున్నవన్నీ జరిగిపోవు… పైగా ఆదినారాయణ రెడ్డి హెచ్చరిస్తున్నట్లు ఊహించనివి కూడా జరిగే అవకాశం ఉంటుంది.



