ఫ్యాన్ గాలి కమలాన్ని తాకినట్టేనా?

Jagan-Modi-PawanKalyan-Chandrababuరాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కాదనలేని సత్యమే. అయితే ఆ సహకారం రాష్ట్ర ఎజెండాకా లేక రాజకీయ పార్టీల వ్యక్తిగత ఎజెండా అమలుకా అనేది ఇక్కడ సందేహించవలసిన అంశం. పొత్తు ఒకరితో పథక రచన మరొకరితో అన్న చందంగా ముందుకెళ్తున్నారు బీజేపీ పెద్దలు. ఒక పక్క, పక్క రాష్ట్రమైనా తెలంగాణ ప్రభుత్వం కేంద్రం పై దూకుడుగా ముందుకెళ్తుంటే ఏపీలో ఆపరిస్థితి లేదనే చెప్పాలి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన బాబు వంటి నేతను అరెస్ట్ చేస్తే కనీస స్పందన కూడా చూపని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో టీడీపీ మిగిలిపోయింది.

బీజేపీ తో పొత్తులో ఉన్న జనసేన కూడా కేంద్రాన్ని సాయం కోరలేని – నిందించే సాహసం చేయలేని దుస్థితిలో ఉంది.కేంద్రం మెడలు వంచుతాం అన్న వైసీపీ కేంద్ర నిర్ణయానికి తలొంచే పరిస్థితిలో ఉంది. వైసీపీ అనే మహమ్మారికి జనసేన – టీడీపీ గెలుపే సరైన వాక్సిన్ అంటూ అవనిగడ్డలో జరిగిన నాలుగో విడత వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఫ్యాన్ గాలి కమలాన్ని తాకినాయా? అన్న సందేహన్నీ రేపాయి.

ADVERTISEMENT

ముందునుంచి పొత్తులో ఉన్న బీజేపీని వదులుకొని పవన్, రాబోయేది టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అంటూ చేసిన వ్యాఖ్యల పరమార్ధ చూస్తే పవన్ కు బీజేపీ దూరమయ్యిందా? లేక బీజేపీ నుండే పవన్ దూరం జరిగారా? అన్న సందేహం అటు బీజేపీ ఇటు జనసేన ఇరు పార్టీల అభిమానులకు కలుగక మానదు. లోపాయికారి మద్దతుతో రహస్య పొత్తులో వైసీపీ – బీజేపీ ఇంతకాలం నెట్టుకొచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తో వీరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేసారు.

వచ్చే ఎన్నికలలో 2014 కూటమితోనే ఎన్నికల బరిలోకి అడుగు పెడతాము అంటూ చెప్పుకొచ్చిన పవన్ ఒక్క సారిగా బీజేపీ ని వదిలి టీడీపీ – జనసేన కలిసి వచ్చే ఎన్నికలలో వైసీపీ ని గద్దెదింపడం ఖాయం అంటూ చెప్పడం చూస్తుంటే వైసీపీ ట్రాప్లో బీజేపీ పెద్దలు ఇరుక్కున్నారా? లేక బీజేపీ రాజకీయ క్రీడలో వైసీపీ ఆడుతుందా? అన్నట్లుగానే భావించాల్సి వస్తుంది.రాష్ట్రంలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ ఏపీ రాష్ట్ర రాజకీయ పార్టీల భవిష్యత్ నే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను నిర్ణయించడమే ఇక్కడ ప్రశార్ధకంగా మారింది.

అయితే జగన్ చేసే విధ్వంసాలకే కేంద్రం మద్దతు ఇస్తుందా? లేక కేంద్రం అండదండలతోనే జగన్ విధ్వంసాలను సృష్టిస్తున్నారా? అనేది మాత్రం సృష్టి రహస్యమే. పోలవరం పూర్తి చేయడానికో, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోవడానికో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికో, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకో, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించడానికో జగన్ కేంద్ర సహాయం ఆశించరా? లేక అవేమి ఆశించరు కాబట్టే జగన్ కు తానూ అనుకున్నవన్నీ దక్కుతున్నాయా? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది.

రాష్ట్రంలో కమలం వాడిపోకుండా కమలాన్ని కొన్ని రోజులు సైకిల్ మోసింది, మరికొన్ని రోజులు ఆ బాధ్యతను నీరు పోసి మరి గాజు గ్లాస్ తీసుకుంది. ఇప్పుడు ఫ్యాన్ తన గాలితో కమలాన్ని చేరే ప్రయత్నం చేస్తుంది. ఆ గాలికి “కమలం వీడుతుందో – వాడుతుందో” కాలమే సమాధానం చెప్పాలి మరి.! కమలం వీడినా వాడినా రాష్ట్రంలో నెలకొన్న ఈ సందిగ్దత పోవాలని ఆశిద్దాం. రాష్ట్రంలోకి అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి కానీ రాష్ట్రం మాత్రం శాశ్వతం అనేది అన్ని రాజకీయ పార్టీలు గుర్తెరిగి నడుచుకుంటేనే రాజకీయాలలో ముందుకెళ్లగలుగుతారు.

ADVERTISEMENT
Latest Stories