వైసీపీ మహిళా ఎమ్మెల్యే అర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరగడం… అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా తీరును తప్పుబట్టడం… అందరినీ కలుపుకుని వెళ్లాలని టీడీపీ ప్రభుత్వానికి చురకలంటించడం… తెలిసిన విషయమే. అంతేకాక ఏకవాక్య క్షమాపణ కోరుతూ స్పీకర్ కు లేఖ రాయాలని రోజాను ఆదేశించిన కోర్టు, సదరు లేఖను పరిగణనలోకి తీసుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ప్రభుత్వానికి సూచించింది.
దీనిపై చర్చ చేపట్టిన ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేత రోజా నుండి పలు డిమాండ్లు చేసారు. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా… అనిత కాళ్లను కడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పట్టు విడుపులతో వ్యవహరించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే… అనిత కాళ్లు కడిగి రోజా క్షమాపణ చెప్పాలని బొండా ఉమా డిమాండ్ చేయడం గమనార్హం.
నిజానికి ఇలాంటి పౌరుష పదజాలనికే రోజా విమర్శల పాలయ్యింది. అలాగే కొడాలి నాని వంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలతో స్పందిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో బొండా చేస్తున్న వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతల బాటలోనే పయనించడం గమనించదగ్గ విషయం. మొన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ‘అరేయ్…’ అంటూ సంభోదించడం… నేడు రోజాను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని కోరడం… రాజకీయాల్లో ఏ మాత్రం ఆహ్వానించదగ్గ మాటలు కావు. నేడు అధికారం ఉంది కదా అని మిడిసిపడే వ్యాఖ్యలు చేయడం ఏ రాజకీయ నాయకుడికైనా మంచి పరిణామం కాదు అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



