ఏపీలో సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. “సరే.. చర్చలకు రండి మాట్లాడుకొందాం,” అని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో ఉద్యోగ సంఘాల నేతలు వెళ్ళివస్తున్నారు. కానీ ప్రతీ సమావేశంలో పాడిందే పాట అన్నట్లు ‘సిపిఎస్ రద్దు చేయలేమని దానికి బదులు గవర్నమెంట్ గ్యారెంటీ స్కీమ్ (జీపీఎస్) అమలుచేస్తామని’ మంత్రి బొత్స చెప్పడం ఉద్యోగ సంఘాల నేతలు అర్దాంతరంగా సమావేశంలో నుంచి తిరిగిరావడం జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వ ధోరణితో విసుగెత్తిపోయున్న ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాల నేతలు ‘మిలియన్ మార్చ్’ లేదా ‘చలో విజయవాడ’ అనుకొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు పాల్పడటంతో వెనక్కుతగ్గారు. కానీ వారు ప్రభుత్వంపై ఆగ్రహం, అసహనంతో ఉన్నారనే సంగతి మంత్రి బొత్స సత్యనారాయణ గ్రహించారు. కనుక మంగళవారం మళ్ళీ చర్చలకు రమ్మనమని ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించారు.
అయితే ఆయన మళ్ళీ అదే పాట పాడతారని తెలిసి ఉన్నప్పుడు చర్చలకు వెళ్ళి ఏం ప్రయోజనం?అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోతే తప్పు తమదే అవుతుందని, అప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు తాము రాజకీయ ప్రోద్బలంతోనే ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని మరికొందరు వాదిస్తున్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వం జీపీఎస్ అమలుచేయాలని ముందే నిర్ణయించుకొన్నందున, ఈ చర్చల వలన ఫలితం ఉండదనే చెప్పవచ్చు. అయినా చర్చలకు ఎందుకు ఆహ్వానిస్తోందంటే, బహుశః ఉద్యోగుల మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చాటిచెప్పేందుకే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతీ సమావేశం తర్వాత ఉద్యోగ సంఘాల నేతలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటం, వాటి వలన వారిలో విబేదాలు, చీలికలు ఏర్పడుతున్నాయి. కనుక మారో రెండు మూడు సమావేశాలలో పాల్గొంటే ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలలో గొడవలు పెరిగి విడిపోయే ప్రమాదం ఉందని కొందరు ఉద్యోగులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొండ నాలికకి మందేస్తే, ఉన్న నాలుక కూడా ఊడిందన్నట్లు అవుతుందని కొందరు ఉద్యోగులు వాదిస్తున్నారు. కనుక ఇప్పుడు వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. మరి తమ సమస్యను ఏవిదంగా పరిష్కరించుకొంటారో? వైసీపీ ప్రభుత్వం వారితో ఏ గేమ్ ఆడబోతోందో?



