సముద్రంలోకి వెళ్ళి తెచ్చుకునేదానికి మళ్ళీ పరిశ్రమలు ఎందుకు?

Botsa Satyanarayana

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాలలో, వ్యాపారాలలో ఆరితేరినవారే కానీ మీడియా ముందుకు వస్తే తడబడకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేరు. పైగా ఆ మాటలు కూడా ఎవరికీ సరిగ్గా అర్దం కావు. అసలు ఆయన చెప్పాలనుకుంటున్నారో కూడా అర్దం కాదు.

ADVERTISEMENT

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ ఊర్లో ఉన్నారు? ఆయన ఎక్కడ దాక్కున్నారు?ఎందుకు దాక్కున్నారు? నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే నాకు మెసేజ్ పెట్టండి,” అని అన్నారు.

పోలింగ్‌కు ముందు తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోవడం బొత్సవారికి తప్పుగా అనిపించలేదు. దగ్గరుండి సాగనంపి వచ్చారు. కానీ అధికారంలో లేని ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళడం ఆయనకు సబబుగా అనిపించడం లేదు!

ఎన్నికలకు ముందుయి జగన్‌ శంకుస్థాపన చేసిన పోర్టులు, జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ల గురించి బొత్సవారు ఎవరికీ తెలియని ఓ కొత్త, గొప్ప విషయం కనిపెట్టి చెప్పారు.

“వీటి కోసం మనమేమీ పెద్దగా పెట్టుబడి పెట్టనవసరం లేదు కదా?పరిశ్రమలు ఏర్పాటు చేయనవసరం లేదు కదా? ఇవన్నీ సహజ సంపదే కనుక సముద్రంలోకి వెళ్ళి తెచ్చేయ్యడం…ఇచ్చేయడమే కదా?” అని రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు అవసరం లేదని చక్కగా చెప్పారు.

వైసీపి నేతలు సంక్షేమ పధకాల గురించి మాట్లాడకపోతేనే ఆశ్చర్యపోవాలి కానీ మాట్లాడితే కాదు. బొత్స సత్యనారాయణ కూడా సంక్షేమ పధకాలతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధి ఏవిదంగా నిలకడగా ఉంటుందో చక్కగా వివరించారు.

“సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ఒక్కో గ్రామానికి కనీసం కోటి నుంచి పది కోట్లు వచ్చింది. ఉన్నవాళ్ళ దగ్గర డబ్బు రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళిపోతుంది తప్ప మార్కెట్లోకి రాదు. కానీ పేదవాళ్ళకు మేము ఇచ్చిన రూ.2.70 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరే ఉండిపోదు. మార్కెట్లోకి సర్క్యులేట్ అవుతుంది. అందుకే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రాష్ట్ర జీడీపీ నిలకడగా ఉంది,” అని ఆర్ధికవేత్తలకు సైతం అంతుపట్టని మరో కొత్త సిద్దాంతాన్ని బొత్సవారు కనిపెట్టి చెప్పారు.

ఆయన చెప్పిన ఈ మాటలు వింటే, సంక్షేమ పధకాలతో జీడీపీ నిలకడగా అభివృద్ధి చెందుతుందనే చిన్న విషయం తెలియకనే ఇంతకాలం దేశాన్ని రాష్ట్రాలను పాలిస్తున్నవారు అభివృద్ధి, పరిశ్రమలు అంటూ ఆరాట పడ్డారనిపిస్తుంది. అయితే సంక్షేమ పధకాల పేరుతో జగన్‌ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన సుమారు పది లక్షల కోట్లకు పైగా అప్పులు, వాటికి నెలనెలా వడ్డీలను ఏవిదంగా తీర్చవచ్చో బొత్సవారే కాస్త వివరించి చెప్పి ఉంటే బాగుండేది.

అలాగే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేదం చేయబోతున్నామని చెప్పుకొంటున్న జగన్‌ ప్రభుత్వం, భవిష్యత్‌లో మద్యం అమ్మకాలను కూడా గ్యారెంటీగా చూపి అప్పులు తెచ్చుకోవడం ఏమిటో కూడా బొత్సవారు కాస్త వివరిస్తే బాగుండేది.

అయినా “పోర్టు ఉంది కనుకనే బాంబే ముంబైగాను, మద్రాస్ చెన్నైగాను మారాయనే గొప్ప విషయాలను సిఎం జగన్మోహన్‌ రెడ్డి కనుగొని చెప్పిన్నప్పుడు, ఆయన కింద పనిచేసే మంత్రులకు ఈ మాత్రం జ్ఞానం ఉండదని ఎలా అనుకోగలము?

ADVERTISEMENT
Latest Stories