పంటలు బాగా పండాలంటే యూరియా అవసరం. కానీ రాజకీయ పార్టీ మనుగడకి కూడా యూరియా అవసరమా? అంటే అవుననే అంటోంది బీఆర్ఎస్ పార్టీ. దానినే ఫాలో అవుతున్న వైసీపీకి కూడా యూరియా వాడుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ రెండు పార్టీల ఉత్థాన పతనాలు ఒకేలా ఉండటం, అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఇంచుమించు ఒకేలా సాగుతుండటం చాలా ఆశ్చర్యకరమే. క్లుప్తంగా చెప్పుకుంటే బీఆర్ఎస్, వైసీపీలు ‘రాజకీయ కవలలు’ అనుకోవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ దాదాపు రెండు నెలల నుంచి రాజకీయాలలో యూరియా విరివిగా వాడుతోంది. కనుక రాజకీయంగా బలంగా ఉంది. కానీ మద్యలో కవిత పోరు, కాళేశ్వరం, సీబీఐ అంటూ రేవంత్ రెడ్డి చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ యూరియా పార్టీని బాగా కాపాడుతోంది.
కనుక జగన్ కూడా వైసీపీకి యూరియా వేసి బలంగా తయారు చేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డిని ఆదేశించారు. ఈ నెల 9న ఏపీలో కూడా యూరియా కోసం వైసీపీ ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.
సిఎం చంద్రబాబు నాయుడుకి పాలన చాతకాకపోవడం వలన జగన్ ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయని, వ్యవసాయరంగాన్ని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని వైసీపీ సోషల్ మీడియా, సొంత మీడియా సాక్షిగా జగన్ ఫోటోలతో పోస్టర్లు వేసుకొని మరీ సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు సమస్యలపై పోరుకి వైసీపీ సిద్దం అని చెప్పారే కానీ ఈ పోరులో జగన్ కూడా పాల్గొంటారా లేదో చెప్పలేదు. అవసరం లేదు కూడా. పాల్గొంటారో లేదో తెలియాలంటే అవతల రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేస్తున్నారో చూస్తే అర్దమవుతుంది. ఆయన యూరియా కోసం పార్టీ శ్రేణులను పంపించి ఫామ్హౌస్లో సేద తీరుతున్నారు. కనుక జగన్ కూడా అదే చేస్తారు.
శవరాజకీయాలు, పరామర్శ యాత్రలు, ఫేక్ ఫోటోలు, వీడియోలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. కనుక యూరియా వాడితే వైసీపీకి బలం వస్తుందేమో చూడాలి!






