తెరాస గా ఉన్న రాష్ట్ర పార్టీని బిఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీల జాబితాలో చేర్చారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర స్థాయిలో ప్రజాదరణ పొందిన పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అని భావించిన కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రచారం చేసుకున్నారు.
అయితే తాజాగా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజల దిరస్కరణకు గురై అధికార పీఠాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి ముందుకు వస్తుందా..? అనే సందేహం పక్క రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కలగకమానదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో…బిఆర్ఎస్ పాత్ర ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది.
2019 ఏపీ ఎన్నికలలో పరోక్షంగా పాల్గొని తమ పార్టీ ఆత్మీయుల గెలుపుకి తమ వంతు పాత్ర పోషించి టీడీపీ పార్టీకి, బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు తమ పార్టీకి రేవంత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు.ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ తిరిగి ఏపీ రాజకీయాల వైపు ద్రుష్టి పెట్టగలరా..? ఏపీ లో ఇప్పటికే అధికార – విపక్షాల మధ్య రాజకీయ విమర్శల వేడి మొదలయ్యింది.
ఏపీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి తోట చంద్రశేఖర్ ను ఏపీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ ఏపీ ఎన్నికల బరిలో దిగుతారా..? లేక గతం మాదిరే తమ తస్మదీయులకు పరోక్ష మద్దతు ఇస్తారా..? లేక తెలంగాణలో పార్టీ కోల్పోయిన పట్టును తిరిగి నిలబెట్టు కోవడానికి పక్క రాష్ట్రాల వైపు తమ కారు స్టీరింగ్ ను తిప్పకుండా గమ్మునుంటారో..? వేచి చూడాలి.
ఒకవేళ బిఆర్ఎస్ ఏపీ ఎన్నికల పై ద్రుష్టి పెట్టి వైసీపీ కి మద్దతుగా ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడినా రేవంత్ ఆ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుని పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి మరో ధమ్కీ సిద్ధం చేయడం, అదే చేత్తో జగన్ కు ఒక ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనపడుతుంది. ఇప్పటికే రేవంత్ ఏపీలో కేసీఆర్ పెట్టిన కార్లన్నీ తిరిగి తెలంగాణకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఏపీ లో కేసీఆర్ కార్లకు ఇంజన్ పని చేయకపోవచ్చు, లేక డ్రైవర్ దొరకపోవచ్చు అంటూ రాజకీయ విశ్లేషణలు మొదలుపెట్టారు.




