సరైన నాయకత్వం లేకనే ఏపీకి ఈ దుస్థితి: బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే

Mla Pilot Rohit Reddyఇప్పటికే వైసీపీ, టిడిపి, జనసేనల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం చాలా వేడెక్కిపోయుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి బిఆర్ఎస్‌ కూడా వచ్చి ఇంకా వేడెక్కిస్తోంది. బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులను రెడ్ హ్యాండ్‌గా పట్టించడంలో కీలకపాత్ర పోషించిన ఆ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందకపోవడానికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడమే తప్ప ఏపీ అభివృద్ధికి ఏనాడూ తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడలేదు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏపీలో చాలా చర్చ జరుగుతోంది. ఏపీలో పలువురు పాత నాయకులు మాతో టచ్చులో ఉన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో బిఆర్ఎస్‌ పార్టీ ద్వారానే ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. మా పార్టీలో చేరేందుకు ఏపీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.

ADVERTISEMENT

ఏపీలో సరైన నాయకత్వం లేదని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పడం రాజకీయ అజ్ఞానమే అని చెప్పకతప్పదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వలేనప్పుడే చంద్రబాబు నాయుడు విద్యుత్‌ సమస్యని పరిష్కరించారు. ఎంతో దూరదృష్టితో అమరావతి నిర్మాణ పనులు చేపట్టారు. పోలవరం పనులు పరుగులు పెట్టించారు. రాష్ట్రానికి ఐ‌టి, పరిశ్రమలని రప్పించేందుకు గట్టిగా కృషి చేశారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే నేడు ఏపీ మరోస్థాయిలో నిలిచి ఉండేది. కానీ రాజకీయంగా కొన్ని తప్పటడుగులు, ఆయనని గద్దె దించేందుకు తెలంగాణ గడ్డపై నుంచి జరిగిన కొన్ని కుట్రల వలన అధికారం కోల్పోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.

తర్వాత ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి బదులు సంక్షేమ పధకాలని ఎంచుకోవడంతో అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. అయితే చంద్రబాబు నాయుడు అంతటి అపార రాజకీయ అనుభజ్ఞుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగన్‌ చాలా బలమైన నాయకుడని నిరూపించుకోంటూనే ఉన్నారు. కనుక నాయకత్వలోపం వలన ఏపీ అభివృద్ధి జరగలేదనే బిఆర్ఎస్‌ వాదన సరికాదు.

నిజానికి సిఎం కేసీఆర్‌ తెలంగాణలో ప్రతిపక్షాలని ఉక్కుపాదం అణచివేసినందునే తిరుగులేని నాయకుడిగా ఎదిగారని చెప్పవచ్చు. అదే… ఆయన ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి, తెలంగాణ జనసమితి, వామపక్షాల తదితర పార్టీల నుంచి అనేకమంది బలమైన నాయకులు కనిపించి ఉండేవారు. కానీ కేసీఆర్‌ రకరకాల వ్యూహాలతో వారి ఎదుగుదలని అడ్డుకొని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.

కానీ ఏపీలో టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు ఏనాడూ ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలని, దాని కోసం ఆయన చేసే పాదయాత్రలని అడ్డుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ దానికి కట్టుబడి ఉండిపోయారు కనుక! కానీ అదే పెద్దపొరపాటని ఇప్పుడు నిరూపితమవుతోంది. చివరికి ఈడీ కేసుల్లో చిక్కుకొని విచారణకి హాజరవుతున్న పైలట్ రోహిత్ రెడ్డి వంటివారు కూడా ఏపీలో నాయకత్వ సమస్య ఉందంటూ చాలా తేలికగా చెప్పేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories