ఓ ముఖ్యమంత్రి ఒత్తిళ్ళకు తలొగ్గి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తప్పులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటికి ఆ ముఖ్యమంత్రి బాధ్యత వహించరు… అని వారికీ తెలుసు. కానీ తప్పులు చేసి కేసులలో చిక్కుకుంటారు.
అయితే మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటి అతికొద్ది మాత్రం తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా న్యాయపోరాటాలు చేయగలుగుతారు. న్యాయస్థానం సాయంతో తమని వేధించిన వారి ప్రభుత్వంలోనే మళ్ళీ పోస్టింగ్ పొంది గౌరవంగా పదవీ విరమణ చేయగలుగుతారు.
వైసీపీ ప్రభుత్వ హయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో పీవీ సునీల్ కుమార్, పీ. సీతారామాంజనేయులు, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టింది.
వారిలో ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న శ్రీలక్ష్మి పట్ల కూటమి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ఆమెకు సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఆమె ఆ పదవిలో గౌరవంగా పదవీ విరమణ చేయబోతున్నారు.
కానీ పీవీ సునీల్ కుమార్, పీ. సీతారామాంజనేయులు ఇద్దరికీ ఆ భాగ్యం ఉండక పోవచ్చు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే మాజీ ఇంటలిజన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అయనపై మరికొన్ని కేసులున్నాయి. కానీ అందుకు వారిద్దరూ ఎటువంటి పశ్చాతాపం చూపలేదు. కనుక సస్పెన్షన్లో ఉండగానే ఇద్దరూ పదవీ విరమణ చేయాల్సి రావచ్చు.
ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు ఎంతో శ్రమించాలి. ప్రతిభ ఉండాలి. అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడు ఆ స్థాయికి చేరుకోగలరు. అంత కఠోర శ్రమతో ఆ పదవులు సాధించిన తర్వాత కూడా వారు తమ శక్తి సామర్ధ్యాలు, తెలివి తేటలతో ప్రభుత్వాలు సజావుగా నడిచేందుకు తోడ్పడాల్సి ఉంటుంది.
కానీ ఈ దశలో దారి తప్పిన అధికారులు చివరికి కేసులలో చిక్కుకొని అత్యంత అవమానకరంగా పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. కనుక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దీనిని ఓ కేస్ స్టడీగా స్వీకరించి బ్యాలన్స్డ్గా ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం చాలా అవసరం.




