రాజకీయాల్లో విజయం సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక పక్క నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ క్యాడర్ ని బలోపేతం చేసుకోవడం, మరో పక్క ప్రజలను ప్రసన్నం చేసుకోవడం అంత తతంగం ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఇక వేరే చెప్పనక్కర్లేదు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అదే చేస్తున్నారట గులాబీ బాస్.
గత నెలలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ 22 వ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ఎన్నికలకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పార్టీ శ్రేణులకు హింట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయినట్లయ్యింది. ప్రతి నిమిషాన్ని కేసీఆర్ చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఓ పక్క పాలనలో స్పీడు పెంచుతూనే, మరో పక్క పార్టీ కార్యక్రమాల్లో కూడా దూకుడు పెంచుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్రం పై ప్రభావం చూపకుండా, పవర్ చేజారకుండా ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తుంది. అందుకే ఈనెల 17న కేసీఆర్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సభ్యులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొనబోతున్నారు. ఏ ఒక్కరూ కూడా గైర్హాజరు కాకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కేసీఆర్ బిఆర్ఎస్ నేతలకు కీలక సూచనలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూనే, వీటిని ఎన్నికలకు సమరశంఖం పూరించే వేదికలుగా కూడా మార్చుకోవాలని సభ్యులకు కేసీఆర్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా పార్టీని బలోపేతం చేసే అంశాలతో పాటు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గాల్లో అవలంభించాల్సిన తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ ప్రస్తావించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కర్ణాటక ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ స్పీడు పెంచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ చేసే ప్రతీ విమర్శని ఎలా తిప్పికొట్టాలో కేసీఆర్ సభ్యులకు డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారని సమాచారం.
నిన్నమొన్నటి దాకా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే సూచనలు కనపడకపోవడంతో కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో అనే ఆసక్తి సభ్యుల్లో నెలకొంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కేసీఆర్ సచివాలయానికి వెళ్తుండటం, ఆయా శాఖలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుండటం, అంతేకాకుండా పార్టీ నేతలతో కూడా తరచుగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో పాలనలో కేసీఆర్ స్పీడు పెంచారనే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.
ఏదిఏమైనా ప్రతిపక్షాల విమర్శలను పవర్ ఫుల్ గా తిప్పికొట్టడానికే కేసీఆర్ బిఆర్ఎస్ నేతలను సిద్ధం చేస్తున్నారంటూ చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది.



