కేసీఆర్‌ లేని బిఆర్ఎస్ పార్టీ… అయ్యో పాపం!

brs_kcr

తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాశించిన కేసీఆర్‌ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పాల్గొనడం లేదు. కనీసం ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావడం లేదు. దీంతో పార్టీ నడిపే బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్ నాయకుడు హరీష్ రావు ఇద్దరిపైనే పడింది.

ADVERTISEMENT

వారిద్దరూ అధికార కాంగ్రెస్ పార్టీని ధీటుగానే ఎదుర్కొంటున్నప్పటికీ, కేసీఆర్‌ లేని లోటు స్పష్టంగా కనబడుతూనే ఉంది. “ఆర్టీసీ బస్సులలో మహిళలు బ్రేక్ డ్యాన్స్ చేసుకోవచ్చు…” అంటూ కేటీఆర్‌ నోరు జారీ క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. అయినా మహిళా కమీషన్‌ నోటీస్‌ ఇవ్వడంతో వెళ్ళి సంజాయిషీ ఇచ్చుకుంటానన్నారు.

ఇక బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మీడియాలో వార్తలు వస్తుంటే వాటిని నిర్ధ్వందంగా ఖండించలేక, మీడియాకు లీగల్ నోటీస్‌ ఇస్తామని బెదిరించి మరోసారి తప్పటడుగు వేశారు.

సిఎం రేవంత్‌ రెడ్డి కూడా విలీనం గురించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఖండించకపోగా, రేవంత్‌ రెడ్డే బీజేపీలో చేరిపోతారని పేలవంగా స్పందించారు.

కేటీఆర్‌ పరిస్థితి ఈవిదంగా ఉంటే, అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడుగా గుర్తింపు పొందిన హరీష్ రావు కూడా సిఎం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ మంత్రులను ఎదుర్కోవడంలో తడబడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో పంట రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి దేవుడిపై ఓట్లు వేసి ప్రజలను కాంగ్రెస్‌వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు.

ఈ విషయం పసిగట్టిన హరీష్ రావు లోక్‌సభ ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టేందుకే రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి దేవుళ్ళపై ఓట్లు వేస్తున్నారు తప్ప నిజంగా మాఫీ చేయరని గట్టిగా వాదించారు. తన వాదనలపై ప్రజలకు నమ్మకం కల్పించి ఆకట్టుకునేందుకు ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాలు విసిరారు.

అయితే సిఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన్నట్లుగానే ఆగస్ట్ 15లోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి, హరీష్ రావుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఊహించని ఈ పరిణామంతో రాజకీయంగా ఇరుక్కున్న హరీష్ రావు “రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయకుండా సగం మందికే ఇచ్చి మోసం చేశారంటూ ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అంతటితో ఆగితే పర్వాలేదు. రేవంత్‌ రెడ్డి దేవుళ్ళపై ఓట్లు వేసి వారిని కూడా మోసం చేశారని కనుక వారు తెలంగాణ ప్రజలపై ఆగ్రహించకూడదని వేడుకునేందుకు గుళ్ళు గోపురాలు, దర్గాలు, మసీదులు, చర్చీల యాత్రకు బయలుదేరుతానని హరీష్ రావు ప్రకటించడంతో నవ్వులపాలవుతున్నారు.

కేసీఆర్‌ లేని లోటు తెలంగాణకు కనబడటం లేదు కానీ బిఆర్ఎస్ పార్టీలోనే కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

అయినా కేసీఆర్‌ గూట్లో నుంచి బయటకు రావడం లేదు. బహుశః కూతురు కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే వస్తారేమో?

ADVERTISEMENT
Latest Stories