మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నారు. ఇందుకోసం ఆయన తనకు అధికారం తెచ్చిపెట్టిన… తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో బలంగా ముడిపడున్న టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్గా మార్చుకొన్నారు కూడా.
బిఆర్ఎస్కు ఏపీలో అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ను నియమించుకొన్నారు. అటు మహారాష్ట్రలో కూడా బిఆర్ఎస్ విస్తరణకు సభలు నిర్వహిస్తూ సన్నాహాలు చేసుకొంటున్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిపిఐ, సిపిఎం పార్టీలు సిద్దపడ్డాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని టేకోవర్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలియగానే ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి వంతపాడేందుకు వామపక్షపార్టీలు సిద్దమయ్యాయి.
కనుక ఆనాడు అలగ్జాండర్ రధం ఎక్కి ప్రపంచాన్ని జయించడానికి దండయాత్రకు బయలుదేరిన్నట్లే, కేసీఆర్ భారత్ను జయించేందుకు తన గులాబీ విమానం ఎక్కి బయలుదేరడమే తరువాయి అని అనుకొంటుంటే కేంద్ర ఎన్నికల కమీషన్ ఏపీ బిఆర్ఎస్కు రాష్ట్ర హోదాను, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, పార్టీలకు జాతీయహోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది.
ఎన్నికల నియామవళి-1968లోని 6వ పేర ప్రకారం వాటికి జాతీయపార్టీ హోదాను, ఏపీ బిఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఢిల్లీ, పంజాబ్లో అధికారంలోకి వచ్చి, గుజరాత్, గోవా రాష్ట్రాలలో పోటీ చేసిన ఆమాద్మీ పార్టీకి జాతీయపార్టీ హోదా కల్పిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. కనుక ఇకపై ఆమాద్మీ చీపురుకట్ట గుర్తుతో దేశవ్యాప్తంగా పోటీ చేయవచ్చు.
ఇక బిఆర్ఎస్ విషయానికి వస్తే, జాతీయపార్టీగా ఎదగాలని కేసీఆర్ కలలు కంటుంటే, కేంద్ర ఎన్నికల కమీషన్ ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కనుక ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీగా ఉంటుంది. ఈ కారణంగా బిఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును ఏపీలోకానీ మరే ఇతర రాష్ట్రాలలో గానీ ఉపయోగించుకోవడానికి వీలుపడదు.
ఎన్నికల నియమావళి ప్రకారమే కేంద్ర ఎన్నికల కమీషన్ ఈవిదంగా చేసినప్పటికీ, అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నవేళ ఈవిదంగా చేయడంతో అన్ని పార్టీలు షాక్ అవుతున్నాయి.
కేసీఆర్ బిజెపియేతర పార్టీలను, వామపక్షాలను కూడగట్టి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తాను ప్రధానమంత్రి అవుదామనుకొంటుంటే, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుపుకొని ప్రధాని పదవి చేపడదామని కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కలుపుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని ఆశపడుతోంది. కానీ కేంద్ర ఎన్నికల కమీషన్ తాజా నిర్ణయంతో వాటి రెక్కలు కత్తిరించేసిన్నట్లవుతుంది. కనుక దేశంలో ప్రతిపక్షాల మనుగడను దెబ్బ తీసేందుకే మోడీ ప్రభుత్వం ఈ కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు సిఎం కేసీఆర్, జాతీయ రాజకీయాలలో ఏవిదంగా ముందుకు సాగుతారనేది చాలా ఆసక్తికరమైన విషయమే.



