ఇన్నాళ్లుగా ఓటమి భారంతో ప్రజలకు, పార్టీకి దూరంగా ఉంటున్న కేసీఆర్ తిరిగి రాజకీయ కురుక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీ బాధ్యతను, ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతున్న కేటీఆర్, హరీష్ రావు లకు కేసీఆర్ రాక మరింత బలం చేకూరుస్తుంది.
బిఆర్ఎస్ ఓటమి తరువాత మొదటిసారిగా బిఆర్ఎస్ భవనానికి వస్తున్న కేసీఆర్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ మీద పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి తగిన సూచనలు, అలాగే పార్టీ నాయకులు ప్రజలలోకి వెళ్లి చేయవలసిన కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాలను పార్టీ నేతలకు వివరించనున్నారు కేసీఆర్.
అలాగే 27 ఏప్రిల్ 2001 న తెలంగాణ ప్రాంతీయ పార్టీగా స్థాపించబడిన తెరాస పార్టీ, 5 అక్టోబర్ 2022 న బిఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. అయితే ఈ ఏప్రిల్ నాటికి పార్టీ స్థాపించి 25 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా పార్టీ ‘సిల్వర్ జూబ్లీ’ వేడుకలు నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
ఈ కార్యక్రమంతో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలకు చేరువ చేసి, తద్వారా కేసీఆర్ ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం మొదలు పెట్టడానికి సిద్దమవుతారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మార్క్ చూడని రేవంత్ సర్కార్ ఇకముందు కేటీఆర్, హరీష్ రావు లతో పాటుగా కేసీఆర్ రాజకీయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
దీనితో రేవంత్ రాజకీయ స్టామినా, కాంగ్రెస్ ప్రభుత్వ బలం, బలహీనతలు అన్ని బహిర్గతం కానున్నాయి. అయితే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడుతున్న అధికార, విపక్ష నేతలిద్దరు కూడా తెలుగు దేశం పార్టీ రాజకీయ విద్యార్థులే కావడం కొసమెరుపు. ఒకరు బాబుకి విధేయుడిగా మెలిగితే మరొకరు బాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు.
అయితే ఒక ఉద్యమ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో పోరాటాలతో, మరెన్నో ఒడిదుకులతో మొత్తానికి బిఆర్ఎస్ గా సిల్వర్ జూబ్లీ తో మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రానుందా.? కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి పలకనుందా.? కేటీఆర్ చెపుతున్నట్టు 60 లక్షల గులాబీ దండు ఒక సైన్యం లా కదిలి 25 ఏళ్ళ బిఆర్ఎస్ కు తిరిగి ప్రాణం పోస్తుందా.? కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిస్తుందా.?




